Seediri Appalaraju Remand: వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు రిమాండ్ విధించింది. కొడుకు ఆరవ్ హిట్ అండ్ రన్ కేసులో కోర్టు అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసులు ఆయనను అంపోలు జైలుకి తరలించారు. సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్ ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆరవ్ పై పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఆరవ్ రిమాండ్ లో ఉన్నాడు. కాగా, ఈ కేసులో తన కొడుకును కాపాడేందుకు కుట్ర చేశారని, సాక్ష్యాలు మార్చారని, తన కొడుకు స్థానంలో మరొక వ్యక్తిని నిందితుడిగా చూపేందుకు ప్రయత్నించారని అప్పలరాజుపై పోలీసులు అభియోగం మోపారు. నిన్న అప్పలరాజుని ఆయన ఇంట్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
ఈ నెల 10న సీదిరి అప్పలరాజు కుమారుడు సీదిరి ఆరవ్ వర్మ బైక్ ఢీకొని గొర్రెల కాపరి చనిపోయాడు. హిట్ అండ్ రన్ కేసులో అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ఏ1గా, సీదిరి అనుచరుడు సిద్ధార్థ ఏ2గా, సీదిరి అప్పలరాజు ఏ3గా ఉన్నారు.
కాగా, సీదిరి అప్పలరాజు అరెస్ట్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అప్పలరాజు అరెస్ట్ పై వైసీపీ చీఫ్ జగన్ తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి అరెస్టును ఆయన ఖండించారు. అసలు అప్పలరాజు చేసిన తప్పేంటి? అని పోలీసులను నిలదీశారు. రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకునే స్థాయికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిందని జగన్ ధ్వజమెత్తారు. 18ఏళ్ల పిల్లాడు పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారణమైతే ఏకంగా హత్య కేసు పెట్టడం, అప్పలరాజును అరెస్ట్ చేయడం.. ఇవన్నీ చూస్తుంటే వైసీపీ నేతల కుటుంబాన్ని వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని జగన్ ఆరోపించారు.












