ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్లలో చరిత్ర సృష్టించింది. అమెరికా మార్కెట్లలో గురువారం జరిగిన ట్రేడింగ్లో కంపెనీ షేర్లు ఏకంగా 16 శాతం పెరిగాయి. దీంతో ఒక్క రోజులోనే మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ సుమారు 450 బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో రూ.42 లక్షల కోట్లకుపైగా పెరిగింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒకే రోజులో ఇంత భారీ స్థాయిలో మార్కెట్ విలువ పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది.
మరోవైపు ఒక్క రోజులోనే ఒక కంపెనీ మార్కెట్ విలువ ఈ స్థాయిలో పెరగడం అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. గతేడాది ఏప్రిల్లో ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఎన్విడియా షేర్లు నాడు భారీగా పెరిగాయి. దాంతో ఈ చిప్ కంపెనీ మార్కెట్ విలువ ఒక ట్రేడింగ్ సెషన్లో 440 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.
కాగా ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఈ రికార్డ్ ను అధిగమించి.. సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తానికి ఈ భారీ లాభంతో టెక్ దిగ్గజం మార్కెట్ విలువ 3.35 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇక బుధవారం మైక్రోసాఫ్ట్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అజ్యూర్ క్లౌడ్ విభాగ ఆదాయం అంచనాలకు మించి 43శాతం వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించింది. అలాగే తమ ఏఐ అసిస్టెంట్ మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్కు కూడా విశేష ఆదరణ లభిస్తోందని తెలిపింది.
యూజర్ల సంఖ్య కూడా 3 కోట్లు దాటిందని వివరించింది. దీంతో ఈ కంపెనీ షేర్లు దాదాపు 16శాతం లాభాన్ని ఆర్జించాయి. మరోవైపు షేరు విలువ కేవలం ఒక రోజులోనే ఈ స్థాయిలో పెరగడం 2008 తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. ఇక మెటా షేర్లు మాత్రం 8శాతం మేర తగ్గి మదుపర్లను నిరాశపర్చాయి. వరుసగా ఏఐలో మెటా పెట్టుబడులు పెరిగిన కారణంగా 11 వ రోజు మెటా షేర్లు పతనమయ్యాయి..












