అమెరికాలో అక్రమంగా నివాసముంటున్నవారికి తప్పుడు పత్రాలతో రాజకీయ ఆశ్రయం (అసిలమ్) కల్పించేందుకు యత్నించిన భారత సంతతి ఇమ్మిగ్రేషన్ లాయర్ సూరజ్ రాజ్ సింగ్పై యూఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వలస చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తూ నకిలీ ఆధారాలు సమర్పించారనే ఆరోపణలతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఆయనకు 4,70,584 డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 4 కోట్లు) సివిల్ పెనాల్టీ విధించే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.
ఈ వ్యవహారంపై యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) నిర్వహించిన లోతైన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. లాయర్ సూరజ్ రాజ్ సింగ్ మొత్తం 54 విభిన్న కేసులకు సంబంధించి సుమారు 118 నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి అధికారులకు అందజేసినట్లు విచారణలో తేలింది. వేర్వేరు క్లయింట్ల కోసం దాఖలు చేసిన దరఖాస్తుల్లో ఒకే రకమైన కథనాలు, మూస వాక్యాలను కాపీ-పేస్ట్ చేస్తూ అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తప్పుడు పిటిషన్లలో అత్యధికం భారత సంతతికి చెందిన వారివే కావడం విశేషం.
ఈ ఘటనపై డీహెచ్ఎస్ జనరల్ కౌన్సెల్ జేమ్స్ పెర్సివల్ తీవ్రంగా స్పందించారు. నకిలీ అసిలమ్ క్లెయిమ్ల వల్ల అమెరికా చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ బలహీనపడటమే కాకుండా, నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, అక్రమంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపే ప్రక్రియలో ఇలాంటి మోసపూరిత పిటిషన్లు తీవ్ర జాప్యానికి కారణమవుతాయని, వలస నిబంధనలను ఉల్లంఘించే న్యాయవాదులు లేదా ఏజెంట్లపై భవిష్యత్తులోనూ కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో అమెరికాలో ఇమ్మిగ్రేషన్ మోసాలపై అధికారులు నిఘాను తీవ్రతరం చేశారు. ముఖ్యంగా పత్రాల దుర్వినియోగం, నకిలీ ఆశ్రయ పిటిషన్ల ద్వారా అమెరికాలో స్థిరపడాలని చూసే వారిపై చట్టపరమైన విచారణలు వేగవంతం అయ్యాయి. లాయర్ సూరజ్ రాజ్ సింగ్ ఉదంతం అమెరికాలో అసిలమ్ కోరే వలసదారులకు మరియు ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులకు ఒక తీవ్ర హెచ్చరికగా నిలిచింది.












