రాష్ట్రంలో ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ రాజు ఆకస్మాత్తుగా ఉన్నట్టుండి కుప్పకూలారు.అసెంబ్లీ ఆవరణలో ఉన్నట్టుండి కింద పడిపోవడంతో మంత్రి వాకిటి శ్రీహరి ఆయనకు సీపీఆర్ చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. రాజు మృతికి కార్డియాక్ అరెస్టు కారణమని తెలుస్తోంది.
అసెంబ్లీ ఆవరణలో ఆయన విధుల్లో ఉండగా ఉన్నట్టుండి కుప్పకూలడంతో ఆయన్ను రక్షించడానికి మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా ప్రయత్నించారు. సీపీఆర్ చేసినా ఆయన ప్రాణాలతో బయటపడకపోవడంతో అధికారులు, మంత్రి సైతం నిరాశకు లోనైనట్టు తెలుస్తోంది. రాజు కుటుంబానికి అధికారులు, మంత్రి సంతాపం తెలిపినట్టు సమాచారం. అసెంబ్లీ ఆవరణలో ఈ ఘటన జరగడంతో అక్కడ అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది.
https://x.com/TeluguScribe/status/2097201757793419362?s=20
పోలీసులు సైతం ఏం జరుగుతుందోని ఒకింత టెన్షన పడినట్టు సమాచారం. కాగా,నిన్న అసెంబ్లీ సమావేశాల వేళ గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవ్వడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉభయ సభలకు హాజరయ్యారు. నిన్న అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద జరిగిన గందరగోళం , పోలీసుల ఓవరాక్షన్ మీద చర్చ జరపాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. దీనికి తోడు శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది.
కాగా, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానం మీద అధికార కాంగ్రెస్ పార్టీ, స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమ అరెస్టులపైనా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ప్రతిపక్షం సంధిస్తున్న ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇస్తున్నట్టు తెలుస్తోంది.












