మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడంతో ఎర్రవల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీకి రాకుండా రూ.కోటికి పైగా వేతనం తీసుకున్నారని, అలెవెన్సులు పొందుతున్నారని ఆరోపిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఆయన ఫామ్హౌస్ను ముట్టడికి పిలుపునిచ్చారు.
దీంతో మార్కుక్ మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రవల్లి పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.వెయ్యి మందికిపైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు సమాచారం. కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లో కంచెను ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే మార్గాలను దిగ్బంధించి,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. డీఐజీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు బలగాలు మోహరించాయి. ఫామ్హౌస్కు చుట్టపక్కల మూడు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫాంహౌస్కు పిలుపునివ్వడంతో బీఆర్ఎస్వీకి చెందిన ఓయూ వర్సిటీ విద్యార్థి నాయకులు సుమారు 150 మంది పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.కాంగ్రెస్ నేతలు చేపట్టనున్న ముట్టడి ప్రయత్నాలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ఆందోళనకు దిగడంతో పోలీసులు సైతం అప్రమత్తం అయ్యారు.
అక్కడ పరిస్థితులు అదుపు తప్పకుండా పోలీసులు బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఎర్రవల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది.ఇదిలాఉండగా, అసెంబ్లీలో సమావేశాలు వాడివేడీగా సాగుతున్నాయి.నిన్న జరిగిన పరిస్థితులు, బీఆర్ఎస్ నేతల మీద కేసులు, అరెస్టులపై ప్రతిపక్షాలు అధికారపార్టీని నిలదీస్తున్నాయి.












