తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం కొనసాగుతోంది. అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ 20ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అసభ్యకర భాష ఎప్పుడూ వినలేదని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. గతంలో స్వయంగా తానేం మాట్లాడారో, ఎలాంటి పదజాలం ఉపయోగించారో తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసని పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను, చివరకు మహిళా జర్నలిస్టులను కూడా ఇష్టానుసారంగా మాట్లాడి అవమానించారని మండిపడ్డారు.
కత్తులతో నరుకుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులు
అసెంబ్లీ నియమ నిబంధనల పేరుతో తమపై ఎథిక్స్ కమిటీ చర్యలకు సన్నాహాలు చేయడంపై కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జెండా, బీ-ఫామ్ మీద గెలిచి, కోట్లాది రూపాయల ఆశతో కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిన కడియం శ్రీహరి తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసిన కాలంలో కడియం శ్రీహరికి ఎథిక్స్, విలువలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కత్తులతో నరుకుతామని బహిరంగంగా బెదిరిస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని ఆరోపించారు.
మగ ఎమ్మెల్యేల చుట్టూ ఆడ పోలీసులను పెట్టారు: సంజయ్
తెలంగాణలో నడుస్తోంది సర్కార్ కాదని, అదొక సర్కస్ కంపెనీ అని పలుమార్లు రుజువైందని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకు వస్తున్న తమను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు మగ పోలీసులను, మగ ఎమ్మెల్యేలను నెట్టివేయడానికి మహిళా పోలీసులను ప్రయోగించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. మహిళా పోలీస్ అధికారి శిల్పవల్లి ప్రవర్తించిన తీరు బాధాకరమని, ఉన్నత విద్యనభ్యసించిన ఆఫీసర్లు ప్రజాప్రతినిధుల చీరలు, జుట్టు పట్టుకుని లాగడం ఏ రకమైన సంస్కారమని నిలదీశారు.
శాసనసభ లోపలా, వెలుపలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా కేసులు, బెదిరింపులు, ఎథిక్స్ కమిటీల పేరుతో గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని, ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే రేవంత్ సర్కార్కు తగిన రీతిలో బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు.












