KTR: తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులు భూ దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం భూ రాబందులకు స్వర్ణయుగంలా మారిందని ధ్వజమెత్తారు. కొంగర కలాన్లో 100 ఎకరాల రైతుల భూమిపై కన్నేశారని.. ఒక సంస్థకు ఆ భూమిని కట్టబెట్టి వెయ్యి కోట్లు కాజేసే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. కొంగర కలాన్ భూముల కుట్రపై ఆ సంస్థకు లేఖ రాస్తానని కేటీఆర్ తెలిపారు.
రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయం
22ఏ నిషేధిత భూముల జాబితా తయారీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారీ అంటే సరిపోదని, రాజీనామా చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. భూ కుంభకోణంలో రెవెన్యూ మంత్రి పాత్రధారి కాగా, సీఎం రేవంత్ రెడ్డి సూత్రధారి అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. భూ బాధితులు ఎవరూ భయపడొద్దు, అందరం ఐక్యంగా పోరాడదాం అన్న కేటీఆర్.. రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు.
నాడు 16 లక్షల ఎకరాలే.. నేడు కోటి 16 లక్షల ఎకరాలు
22ఏ నిషేధిత జాబితాలో కోటి ఎకరాల భూమిని చేర్చిన అంశాన్ని ఎండగడతామనే బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిషేధిత జాబితాలో 16 లక్షల ఎకరాలే ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అది కోటి 16లక్షల ఎకరాలకు చేరిందని కేటీఆర్ తెలిపారు. 22ఏ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
22ఏ నిషేధిత జాబితాలో భూములు ఉండి ఇబ్బందులు పడుతున్న బాధితులతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.










