తెలంగాణ

22ఏతో లక్షల మంది భూములు కొట్టేయడానికి రేవంత్ కుట్రలు- హరీశ్‌రావు

రచన: Mahesh7 నిమిషాల పఠనం

తెలంగాణలో 22-ఏ భూముల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. 22-ఏ అనేది లక్షల మంది ప్రజల ఆవేదనగా మారిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ సమస్య ఉందని, ఎవరి నోట విన్నా 22-ఏపై ఆవేదనే వినిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ సమస్య మొదలైందని బాధితులు చెబుతున్నారని ఆయన అన్నారు.

Harish Rao: తెలంగాణలో 22-ఏ నిషేధిత భూముల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. 22-ఏ అనేది లక్షల మంది ప్రజల ఆవేదనగా మారిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ సమస్య ఉందని, ఎవరి నోట విన్నా 22-ఏపై ఆవేదనే వినిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ సమస్య మొదలైందని బాధితులు చెబుతున్నారని ఆయన అన్నారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించారు. 22ఏ భూ బాధితులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు.

దేవాదాయ, అసైన్డ్ భూములు కాపాడేందుకు 22ఏ

1908లో బ్రిటీష్ కాలంలో 22-ఏ నిబంధనను తీసుకొచ్చారని హరీశ్‌రావు వివరించారు. నిర్దిష్టమైన భూములను నిషేధించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం దీని ఉద్దేశమన్నారు. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ భూములను కాపాడేందుకు 22-ఏ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. 22-ఏ 1(ఏ) కింద ప్రభుత్వ, పోరంబోకు భూములు, 22-ఏ 1(బీ) కింద ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు, 22-ఏ 1(సీ) కింద దేవాదాయ, వక్ఫ్ భూములు, 22-ఏ 1(డీ) కింద ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన భూములు వస్తాయని చెప్పారు.

ఆస్తులు అమ్ముకోలేక అవస్థలు

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని చెప్పారు. కట్నంగా ఇచ్చిన భూములను అల్లుళ్లు తీసుకోని పరిస్థితి ఏర్పడిందని, ప్రజలు తమ ఆస్తులను అమ్ముకోలేక, అవసరాలకు ఉపయోగించుకోలేక అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భూమి చుట్టూ రేవంత్ పాలన

“రాజ్యం అంటే భూమి కాదు.. భూమిపై బతికే మనుషులు” అని హరీశ్‌రావు అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం పనిచేసేదని, ప్రస్తుతం భూమి కేంద్రంగా రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందని విమర్శించారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు.. భూమి చుట్టూ రేవంత్‌రెడ్డి పరిభ్రమిస్తున్నారని విమర్శించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా రేవంత్, పొంగులేటి

లగచర్ల నుంచి హిల్ట్ పాలసీ వరకు అన్ని భూములకు సంబంధించి కుంభకోణాలేనని హరీశ్‌రావు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక “భూమి.. భూమి.. భూమి” అనే ఆలోచనే ఉందని విమర్శించారు. రేవంత్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాత్రికి రాత్రే ఒక్క గీతతో లక్షల మంది ప్రజల ఆస్తులను జీరో వాల్యూ చేశారని హరీశ్‌రావు చెప్పారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందన్నారు. నిన్నటివరకు హైడ్రా పేరుతో, ఇప్పుడు 22-ఏ పేరుతో ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు.

ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని హరీశ్‌రావు గుర్తు చేశారు. కానీ ప్రజల ఆస్తులను ప్రభుత్వమే భక్షిస్తే వారు ఎవరిని శరణు కోరాలని ప్రశ్నించారు. ప్రభుత్వం భూమిని కేవలం నాలుగు గజాల స్థలంగా చూడొచ్చు.. కానీ రైతుకు అదే భూమి జీవనాధారమనే విషయాన్ని మర్చిపోకూడదని చెప్పారు.

భవిష్యత్తుపై పెట్టుకున్న భరోసా భూమి

పేదవాడికి భూమి జీవితకాలం పొదుపు అని, మధ్యతరగతి కుటుంబాలకు అది పిల్లల భవిష్యత్తుపై పెట్టుకున్న భరోసా అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒక తండ్రికి కూతురి పెళ్లి కోసం దాచుకున్న ఆస్తి, తల్లిదండ్రులకు పిల్లల చదువుల కోసం పెట్టుకున్న భరోసా, ఒక కుటుంబానికి వైద్యం కోసం చివరి ఆధారం కూడా భూమేనని చెప్పారు.

ప్రజల ఆస్తులపై అనిశ్చితిని తొలగించాలి

అలాంటి భూములపై ప్రభుత్వం అనిశ్చితి అనే కత్తిని వేలాడదీసిందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం భూమిని ఒక మార్కెట్ వస్తువుగా కాకుండా ప్రజల హక్కుగా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజ్యం అంటే మనుషులని రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. 22-ఏ సమస్యపై ప్రభుత్వం తక్షణం స్పష్టత ఇవ్వాలని, ప్రజల ఆస్తులపై నెలకొన్న అనిశ్చితిని వెంటనే తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

#Harish Rao#Telangana Politics#BRS#BRS Party#Telangana Congress#Revanth Reddy#22-A Lands#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి