శ్రీశైలం జలాశయంలో తగినంత నీటి నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వానాకాలం పంటల సాగు సమయం ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు హెచ్చరిస్తున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నా, ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం వనపర్తి జిల్లా రేవల్లి మండలం గౌరీదేవిపల్లి వద్ద ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (KLI) స్టేజ్-3 పంప్హౌస్ను మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం స్వయంగా పరిశీలించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలంలో 124 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉన్నప్పటికీ, కల్వకుర్తి పంపులను పూర్తిస్థాయిలో నడపకపోవడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా రోజుకు 10 నుండి 12 టీఎంసీల నీటిని తరలించుకుపోతుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పాలమూరు రైతుల గొంతు కోస్తోందని మండిపడ్డారు.
కల్వకుర్తి పంప్హౌస్లకు గత కేసీఆర్ ప్రభుత్వంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక డెడికేటెడ్ లైన్లను ఏర్పాటు చేశారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సరఫరాను సరిగా నిర్వహించకపోవడం వల్లే మోటార్ల బేరింగ్లు దెబ్బతిని రిపేర్లకు గురవుతున్నాయని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం నాటి ఒప్పందాల ప్రకారం పంపులను రోజుకు 24గంటల పాటు నిరంతరాయంగా నడిపి ఉంటే, ఉన్న నీటితో ఈ వానాకాలంతో పాటు రాబోయే యాసంగి పంటలకు కూడా సాగునీరు పుష్కలంగా అందించే అవకాశముండేదని వివరించారు. ముఖ్యమంత్రికి 'ఫ్యూచర్ సిటీ' రియల్ ఎస్టేట్ దందాలపై ఉన్న ధ్యాస, కష్టపడే రైతాంగంపై లేకపోవడం శోచనీయమని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తాము పంప్హౌస్ పరిశీలనకు వస్తున్నామని తెలిసిన వెంటనే అధికారులు హడావుడిగా గుడిపల్లి వద్ద మోటార్లను ఆన్ చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికారికంగా నీటిని తరలిస్తుంటే, కరెంట్ కోతల సాకుతో ఏపీ దోపిడీకి ఇక్కడి ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. సీఎం సొంత జిల్లాలోనే రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోందన్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పోరాటాలకు భయపడే ప్రభుత్వం నామమాత్రపు చర్యలు తీసుకుంటోందని, ఇప్పటికైనా సాగునీటి ప్రణాళికపై ప్రభుత్వం స్పష్టతనివ్వకపోతే రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కేవలం 15 రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం 70 టీఎంసీల నీటిని డ్రా చేసుకున్నా మన ప్రభుత్వం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. కల్వకుర్తి పంపుల నిర్వహణ చేతకాకపోతే బీఆర్ఎస్కు అప్పగిస్తే తామే నడిపి చూపిస్తామని సవాలు విసిరారు. మరో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, పంప్హౌస్ల వద్ద మోటార్లు ఆపకుండా నిరంతరం నడిపేవరకు పంప్హౌస్ వద్దే టెంట్లు వేసుకుని నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పంటలు ఎండిపోతే దానికి సంపూర్ణ బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రతిపక్ష నేతలు హెచ్చరించారు. జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేఎల్ఐ పంపులన్నింటినీ 24 గంటల పాటు నడిపించి, చివరి ఆయకట్టు వరకు నీరు పారేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పంటలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.









