ED Raids: హైదరాబాద్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రైడ్స్ కలకలం రేపాయి. AMR గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా AMR కంపెనీ ఆఫీసుల్లో సోదాలు చేశారు. హైదరాబాద్తో పాటుగా ఢిల్లీ, జార్ఖండ్, కోల్కతాలో ఏఎంఆర్ ఆఫీసుల్లో ఏకకాలంలో ఈ రైడ్స్ జరిగాయి.
కోల్కతాలోని ఈడీ జోనల్ ఆఫీస్ నుంచి ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు వచ్చాయి. హైదరాబాద్ ఈడీ అధికారులతో సంయుక్తంగా ఏఎంఆర్ కంపెనీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. కోల్కతాలో నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు చేసినట్లు సమాచారం. నిధుల మళ్లింపుపైనా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జార్ఖండ్లో మైనింగ్కు సంబంధించిన వ్యవహారంపై ప్రధానంగా కేసు నమోదైంది. ఇందులో భాగంగా జార్ఖండ్, కోల్కతాలో ఈడీ సోదాలు చేసింది. ఈ క్రమంలో ఏఎంఆర్ కంపెనీ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో ఈడీ అధికారులు హైదరాబాద్ నగరానికి వచ్చేశారు.
కంపెనీ కార్యాలయాలతో పాటు ప్రమోటర్ల నివాసాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేశారు. ల్యాప్ ట్యాప్స్, హార్డ్ డిస్కులు, డిజిటల్ డివైజ్లను అధికారులు సీజ్ చేసినట్లుగా సమాచారం. ఆర్థిక లావాదేవీలను సైతం అధికారులు పరిశీలించారని తెలుస్తోంది. ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ మైనింగ్, కన్స్ట్రక్షన్, నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టింది.
మహేశ్ రెడ్డి ఏఎంఆర్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 25లో ఉన్న మహేశ్ రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. ప్రముఖ రాజకీయ నేతలకు మహేశ్ రెడ్డి బినామీగా ఉన్నట్లుగా ఈడీ అనుమానిస్తోంది. ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, వారి వ్యక్తిగత వ్యవహారాలను మహేశ్ రెడ్డి చూస్తున్నట్లుగా ఈడీ చెబుతోంది. మహేశ్ రెడ్డి టాలీవుడ్లో ప్రముఖ ప్రొడ్యూసర్ కూడా. శిరిడీసాయి, ఓం నమో వెంకటేశాయ సినిమాలకు మహేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.








