రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ సహా మొత్తం 6 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణలో మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.హైదరాబాద్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. సంగారెడ్డి, యాదాద్రి భువనగిరిలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఎవరూ బయటకు రాకూడదని వెల్లడించింది.
కాగా, ఎల్ నినో బ్రేక్ వల్లే తెలంగాణలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. మొన్నటివరకు వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ సారి అల్పపీడనం ఎఫెక్ట్ వలన రాష్ట్రంలో వర్షాలు కురిసినా సాగుకు ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తోంది. సాగు నీళ్లు ఇవ్వాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది లోటువర్షపాతం నమోదు కావడంతో వేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి రాత్రిళ్లు పంటలు తడుపుతున్నారు.కాగా, ప్రాజెక్టుల్లోనూ పూర్తి స్థాయిలో నీరు నిల్వలేదని సమాచారం. ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద వచ్చినా పూర్తిస్థాయి నీటిమట్టం లేదని అధికారులు చెబుతున్నారు.












