TG: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA)కు నూతన నాయకత్వం ఖరారైంది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కె.గౌతమ్ కుమార్ చేపట్టనుండగా.. ప్రధాన కార్యదర్శిగా ఎల్.రమణ్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ మేరకు రెవెన్యూ భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.
ట్రెసా మాజీ అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు సీసీఎల్ఏ యూనిట్కు చెందిన ప్రతినిధులు హాజరై నూతన కార్యవర్గ ఎంపికపై చర్చించారు.
ఎలాంటి పోటీ లేకుండానే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు పేర్లను ఖరారు చేశారు. ఇటీవల ట్రెసా అధ్యక్షుడిగా ఉన్న వంగ రవీందర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయడంతో అధ్యక్ష పదవి ఖాళీ అయింది .
ఆగస్టు 31న ఆయన రిటైర్ కావడంతో సంఘానికి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన కె.గౌతమ్ కుమార్కు అధ్యక్ష పదవిని అప్పగించారు. ఆయన గత ఏడేళ్లుగా సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఎల్.రమణ్ రెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు.
కాగా, సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న వంగ రవీందర్ రెడ్డికి కీలక బాధ్యతలను కొనసాగిస్తూ గౌరవ అధ్యక్షుడి హోదా కల్పించారు. నూతన నాయకత్వంలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మరింత సమర్థవంతంగా పనిచేయాలని కార్యవర్గం నిర్ణయించింది.







