TG: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో ఆదివారం ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, డిపెండెంట్ల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దశాబ్దాలుగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనప్పుడు ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రభుత్వం సీరియస్గా అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం సీరియస్
గత పదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని హెల్త్ కార్డు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు.
ఉద్యోగుల ఆరోగ్యం, వారి కుటుంబాల సంక్షేమం విషయంలో ప్రజా ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఈహెచ్ఎస్ను సక్సెస్ఫుల్గా అమలు చేయడంలో అధికారులు, ఉద్యోగ సంఘాలు తమ బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగ సంఘాలతో చర్చించి పథకం రూపకల్పన
ఈహెచ్ఎస్ పథకం రూపకల్పన, విధివిధానాలపై ఉద్యోగ సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపినట్లు ఈ సందర్భంగా భట్టి వెల్లడించారు. ఉద్యోగ సంఘాల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ పథకం రూపొందించామని చెప్పారు. ప్రభుత్వం మానవీయ దృక్పథంతో తీసుకొచ్చిన ఈ పథకాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అధికారులు, ఉద్యోగ సంఘాలు, సంబంధిత వర్గాలందరిపైనా ఉందన్నారు.
ప్రస్తుతం ఈహెచ్ఎస్లో 354 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు. మరికొన్ని ఆసుపత్రులను డీమ్డ్ ఎంప్యానెల్డ్ విధానంలో చేర్చినట్లు వెల్లడించారు. ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి పథకం సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఈ పథకాన్ని ఎవరూ నిర్లక్ష్యంగా తీసుకోవద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, జేఏడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ మహేష్ దత్ ఎక్కా, హెల్త్ అండ్ మెడికల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టీనా, హోం డిపార్ట్మెంట్ సెక్రెటరీ మోగితా రాణా, ఈహెచ్ఎస్ సీఈవో హనుమంతు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.








