TG: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరై.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. సభలో జరిగే ప్రతి చర్చలో చురుగ్గా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా గులాబీ బాస్.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. అసెంబ్లీ, మండలి సమావేశాలను ఎవరూ లైట్ తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్రెడ్డిపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన అట్టర్ఫ్లాప్ అయిందని విమర్శించారు. సభలో అధికార పార్టీ నేతలు తన గురించి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే స్పందించకుండా.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపైనే దృష్టి పెట్టాలని పార్టీ సభ్యులకు సూచించారు.
పాలన చేతకాకే ముఖ్యమంత్రి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. ప్రజా సమస్యలే బీఆర్ఎస్ అజెండాగా ఉండాలని, కాంగ్రెస్, బీజేపీ విధానాలను సభలో ఎండగట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. స్పీకర్ పక్షపాత ధోరణి, అప్రజాస్వామిక విధానాలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు.
కృష్ణా, గోదావరి జలాలపై ఉద్ధృత పోరాటం
రైతులకు నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాల అంశంపై బీఆర్ఎస్ తరఫున ఉద్ధృతంగా పోరాడాలని సూచించారు. రాజకీయ కారణాలతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించిన కేసీఆర్.. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులను పరిశీలిద్దామని పార్టీ నేతలకు సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా జరుగుతుందని కూడా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది: హరీశ్రావు
సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలను కనీసం నెలరోజుల పాటు నిర్వహించేలా బీఏసీలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కేసీఆర్ సూచించినట్లు హరీశ్రావు తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా.. అన్ని వర్గాలను మోసం చేసిందని హరీశ్రావు విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, బలహీనవర్గాలు, మహిళలకు తీరని అన్యాయం చేసిందన్నారు.








