krish Jagarlamudi: ఎంత పెద్ద దర్శకుడైనా వరుసగా రెండు ఫ్లాప్స్ గనక ఇస్తే మళ్ళీ ఆ దర్శకుడితో సినిమా చేయడానికి హీరోలు ఆలొచిస్తారు. నిర్మాతలు అంత త్వరగా ముందుకు రాకుండా మొహం చాటేస్తారు. అందుకే, ఇప్పుడు వివి.వినాయక్, పూరి జగన్నాధ్ లాంటి వారు గ్యాప్ తీసుకుంటున్నారు. ఒకదశలో పూరి జగన్నాధ్ స్టార్స్ తో సినిమా చేయలేక సొంత తమ్ముడితో 143 తీసి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇంకా, వినాయక్ ప్రయత్నాలలో ఉన్నాడు.
క్రిష్ జాగర్లమూడి..గమ్యం సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురం లాంటి చక్కటి సినిమాలను తీసి క్రేజ్ తెచ్చుకున్నాడు. కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రాలతో అగ్ర దర్శకుడిగా మారాడు. ఇలాంటి దర్శకుడు ఫ్లాప్స్ తో రేసులో వెనకబడి..ఇప్పుడు అంతా కొత్తవాళ్ళతో సినిమాను తీసి రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అంతేకాదు, ఇందులో ఆయన కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
వాస్తవానికి, ఈ పాత్రను సీనియర్ దర్శకుడు గౌతమ్ మీనన్ తో చేయించాలనుకున్నాడట. కానీ, ఫైనల్గా ఆయనే చేశాడట. గమ్యం సినిమాలో కూడా క్రిష్ నక్సలైట్ పాత్రలో కనిపించాడు. అలాగే, నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టిర్ బయోపిక్స్ లో, మహానటి సినిమాలో కనిపించాడు. ఆ అనుభవంతోనే ఇప్పుడు, ఓ కీలక పాత్రను ఆయనే చేశాడు. ఇటీవల ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో పూర్తి చేశారు.
ఘాటి ప్రభావం:
అనుష్క శెట్టితో క్రిష్ ఘాటి చిత్రాన్ని తీసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్తో చేయాల్సిన హరి హర వీరమల్లు మధ్యలో ఆగిపోయిన తర్వాత ఘాటి చేశాడు. ఆ సినిమా మధ్యలో ఆగిపోవడం..ఘాటి ఫ్లాపవడంతో మళ్ళీ స్టార్స్ తో సినిమా అంటే రిజెక్షన్స్ గ్యారెంటీగా వస్తుందని ముందే ఊహించి మళ్ళీ ఫస్ట్ సినిమాలా అంతా కొత్త వాళ్ళతో 'జెంజ్ బ్యాచ్' అంటూ సరికొత్త ప్రయోగం చేశాడు. మరి, ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.







