Palghar Hospital Attack: మహారాష్ట్రలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున పాల్ఘర్లోని రిలీఫ్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందిపై శివసేన కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన రిసెప్షనిస్ట్పై ఓ కార్యకర్త చెంపదెబ్బ కొట్టినట్లు, మరో మహిళా ఉద్యోగిని బెదిరించినట్లు తెలుస్తోంది. జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన ‘దహీ హండి’ కార్యక్రమంలో పాల్గొని గాయపడిన గోవిందాలకు చికిత్స అందించిన అనంతరం బిల్లు విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం.
ఆస్పత్రి ఉద్యోగి కుందన్ సాంకే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శివసేన జిల్లా అధ్యక్షుడు, నగర అధ్యక్షుడు రాహుల్ ఘరాట్ తదితరులు ఐసీయూలోకి అత్యవసర ప్రవేశించి వైద్యులతో వాగ్వాదానికి దిగినట్లు తెలిపారు. వాళ్లను ఆపడానికి ప్రయత్నించిన రిసెప్షనిస్ట్పై ఓ కార్యకర్త చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
డిశ్చార్జ్ సమయంలో రూ.19,866 బిల్లు చెల్లించాలని ఆస్పత్రి సిబ్బంది కోరడంతో గోవిందాల బృందం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బందితో శివసేన కార్యకర్తలు, నాయకులు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
మరోవైపు కొంతమంది కార్యకర్తలు ఆస్పత్రి ఐసీయూలోకి కూడా వెళ్లినట్లు సిబ్బంది ఆరోపించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఓ గోవిందాకు అమర్చిన ఐవీ డ్రిప్ను తొలగించి, అతడిని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆస్పత్రి వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఆస్పత్రిలో జరిగిన ఘటనపై కాంగ్రెస్ నేత అతుల్ లొంధే పాటిల్ తీవ్రంగా స్పందించారు. దీనిని ‘సిగ్గుచేటు’ ఘటనగా అభివర్ణిస్తూ.. మహాయుతి నేతల గూండాగిరిని ఇది చూపిస్తోందని విమర్శించారు. వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిపై దాడులు జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. బాధ్యులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.
ఈ క్రమంలో పాల్ఘర్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుందన్ సాంకే, రాహుల్ ఘరాట్, స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర గవిత్ కుమారుడు రోహిత్ గవిత్ సహా కనీసం 17 మందిని నిందితులుగా పేర్కొంటూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన్నట్లు సమాచారం. తాజా ఘటనపై పాల్ఘర్లోని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వైద్యులపై, సిబ్బందిపై దాడుల పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారించి తమకు రక్షణ కల్పించాలని వైద్యులు చెబుతున్నారు.









