TG: హైదరాబాద్లో జరిగిన పబ్ ఘటనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదని, నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన సోషల్ మీడియా వేదికగా పోలీసులను ప్రశ్నించారు. కాంగ్రెస్ యువ నేతలు పబ్బుల్లో మునిగి తేలుతుంటే.. నగర పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారా? అంటూ తీవ్రంగా స్పందించారు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలంగాణ పోలీసులను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఘటనపై పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులు ఇంకా ఎందుకు అరెస్టు కాలేదని తన పోస్ట్లో ప్రశ్నించారు.
ఘటనతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూత్ కాంగ్రెస్ నేత అరవింద్ యాదవ్ ఎక్కడ ఉన్నారో పోలీసులు వెల్లడించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన టవర్ లొకేషన్ను పరిశీలించాలని, పబ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి దర్యాప్తు చేయాలని సూచించారు.
పబ్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
‘కారా కారా’ పబ్ రాత్రి 2 గంటల వరకు కొనసాగిందన్న ఆరోపణలను ఆయన తన పోస్ట్లో ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో విధుల్లో ఉన్న సెక్టార్ ఎస్సై, నైట్ సూపర్వైజరీ ఆఫీసర్ (NSO)పై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. పబ్ నిబంధనలు ఉల్లంఘించి ఉంటే లైసెన్సును ఎందుకు రద్దు చేయలేదని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును రాజీ చేసి వదిలేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పంచాయతీ చేసి కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారా అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజా ఘటనపై పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పబ్ ఘటనపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.









