గతనెల రోజులుగా బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతూనే పోతున్నాయి. ఫలితంగా బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు జంకుతున్నారు.ఆషాఢం సేల్ పూర్తవడంతో ఆఫర్లు కూడా పెద్దగా లేవు. మరోవైపు శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయ్యింది. దీంతో బంగారం ధరలు తగ్గుతాయని భావించిన వారికి వరుసగా షాకులు తగిలాయి.
ఈ క్రమంలోనే తాజాగా పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. రాఖీ పండుగ వేళ బంగారం ధరలు దొగొచ్చాయి. దీంతో బంగారం షాపులు కళకళలాడుతున్నట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధరలు రాఖీ పండుగ రోజే పతనం కావడంతో తమ సోదరి లేదా సోదరుడి కోసం బహుమతిగా ఇవ్వాలనుకునే వారు కొనుగోళ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రాము బంగారం అయినా బహుమతి గా ఇవ్వాలని భావించిన వారు పసిడిని కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు గణనీయంగా పడిపోవడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా తగ్గిన ధరల ప్రకారం.. హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం 10 గ్రాములపై రూ.3,160 తగ్గగా రూ.1,59,820 వద్దకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్స్ గోల్డ్ విషయానికొస్తే 10 గ్రాములపై రూ.2,900 మేర తగ్గి రూ.1,46,500 కు చేరుకుంది. ఇదిలాఉండగా, దేశంలో కొందరు రాఖీ పౌర్ణమి రోజున అక్కాచెల్లెళ్లకు బంగారు నాణేలు, చిన్నచిన్న ఆభరణాలు బహుమతిగా సమర్పించడం ఆనవాయితీగా భావిస్తారు. పండుగ రోజున ధరలు తగ్గడం అటు వినియోగదారులు, ఇటు వ్యాపారులకు కూడా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.












