Mla Anirudh Reddy: జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తన నియోజకవర్గానికి రావాల్సిన నిధుల కోసం సొంత ప్రభుత్వంపైనే పోరాటం చేస్తానని చెప్పారు. పెండింగ్ బిల్లులు పరిష్కరించుకుంటే దీక్షకు కూడా దిగుతానని ఆయన హెచ్చరించారు. అందులో తప్పేమీ లేదన్నారు. తన నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పెడితే ఎవరినైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధని అనిరుధ్ రెడ్డి ప్రకటించారు. నాకు ఓటు వేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు, వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని తేల్చి చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అయినా కొట్లాడతానని చెప్పారు.
నేను ప్రశ్నిస్తూనే ఉంటా
''ఇది ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. మన పని జరిగే వరకు ప్రశ్నిస్తూనే ఉండాలి. అంబేద్కర్ పై గౌరవంతోనే నేను ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటాను. నా నియోజకవర్గ ప్రజల కోసం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటాను. కొట్లాడతానే ఉంటాను. మా దగ్గర నిధులు లేక రోడ్లు, కొన్ని పనులు ఆగిపోయాయని ముందే చెప్పాను. బిల్లులు కావాలి అందుకోసం పోరాటం చేస్తానని చెప్పా. ప్రజల కోసం పోరాటం చేయటంలో తప్పేమీ లేదు'' అని అనిరుధ్ రెడ్డి అన్నారు.
మహిళలను బాధ పెట్టకూడదు
మహిళలు కంటతడి పెడితే సునామీ వస్తుందన్నారు అనిరుధ్ రెడ్డి. మహిళలను బాధ పెట్టకూడదన్న ఆయన తాను ఆడవారిని ఎంతగానో గౌరవిస్తానని చెప్పారు. మంత్రి కొండా సురేఖ అంశంలో ఎమ్మెల్యేలను ఎవరూ ప్రెస్ మీట్ పెట్టమని చెప్పలేదన్న అనిరుధ్ రెడ్డి.. తనను ఎవరూ ప్రెస్ మీట్ కు ఆహ్వానించలేదన్నారు. సీఎం రేవంత్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
ప్రెస్ మీట్ పెట్టాలని ఎవరూ చెప్పలేదు
''ఏ ఎమ్మెల్యేకి కూడా ఎవరూ ఫోన్ చేసి పిలవలేదు. సీఎం రేవంత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. ఎమ్మెల్యేలకు ఫోన్లు వచ్చాయని, ఫైల్స్ ఉంటే క్లియర్ చేస్తారు, మీరు ప్రెస్ మీట్ పెట్టండని చెప్పినట్లుగా కొన్ని పేపర్లు రాశాయి. అది కరెక్ట్ కాదు. సీఎం రేవంత్ పై మాట్లాడారని ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారు తప్ప.. ఎవరూ ఫోన్ చేసి రండి అని చెప్పలేదు.
నేను మహిళలను గౌరవిస్తాను
నా గురించి నేను చెబుతున్నా. వేరే వాళ్ల గురించి నేను చెప్పడం లేదు. నేను ఎప్పుడూ మహిళలను గౌరవిస్తా. నేను మహిళలపై ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టను. మా అమ్మ తిట్టినా తల దించుకుని వింటాను తప్ప ఎదురు మాట్లాడను. మహిళను తిడితే మహిళా లోకం మనపై రివర్స్ అవుతుంది. మహిళ కంటి నుంచి ఒక్క చుక్క కన్నీరు భూమి మీద పడినా అది సునామీగా మారి అందులో మనం కొట్టుకుపోతాం. నేను ఎప్పుడూ కూడా మహిళల మీద ప్రెస్ మీట్ పెట్టను. వాళ్లు తిడితే నేను అక్షితలుగానే తీసుకుంటాను కానీ నేను ఏమీ అనను. కొండా సురేఖ అంశంపై ఎవరూ ఏమీ మాట్లాడొద్దని సీఎం రేవంత్ కూడా చెప్పారు. ఏఐసీసీ, టీపీసీసీ, సీఎం నిర్ణయం ఏదైనా దానికి మేము కట్టుబడి ఉంటాము'' అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పారు.












