ఇటీవలి కాలంలో చిన్నపాటి విభేదాలు, కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను రచ్చకెక్కించుకుంటూ, ఆవేశంతో దాడులకు తెగబడుతున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. దంపతుల మధ్య వివాదాలు చివరికి పెళ్లిళ్లతో పాటు శుభకార్యాల్లోనూ రసాభాస సృష్టించే స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్న ఘటనే దీనికి ఉదాహరణగా నిలిచింది.
సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ శివాలయం కళ్యాణమండపం ఆదివారం ఒక హైడ్రామాకు వేదికైంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రావణ్ కుమార్ అనే వ్యక్తికి గతంలో గోదావరిఖనికి చెందిన సౌమ్యతో వివాహమైంది. అయితే, పెళ్లయిన కొద్దిరోజులకే వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ గొడవలు తీవ్రరూపం దాల్చడంతో శ్రావణ్పై భార్య సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనితో పాటు కుటుంబ సభ్యులపై గృహహింస, వరకట్న వేధింపుల కింద కేసులు నమోదు చేయించి చట్టపరంగా పోరాడుతోంది.
ఈ క్రమంలో శ్రావణ్ కుమార్ సోదరి వివాహం నిశ్చయమైంది. ఆదివారం శివనగర్ శివాలయంలో పెళ్లి జరిపించేందుకు కుటుంబ సభ్యులంతా నిశ్చయించి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భార్య సౌమ్య, తన కుటుంబ సభ్యులతో కలిసి నేరుగా కళ్యాణమండపానికి చేరుకుంది. అక్కడున్న శ్రావణ్ కుమార్, అతని కుటుంబ సభ్యులతో మొదట తీవ్రంగా వాగ్వాదానికి దిగింది. మాటమాట పెరగడంతో ఆవేశంతో రగిలిపోయిన సౌమ్య బంధువులు, పెళ్లి మండపంలోనే అందరి ముందే శ్రావణ్ ఫ్యామిలీపై భౌతిక దాడికి పాల్పడ్డారు.
ఈ ఆకస్మిక దాడితో శుభకార్యానికి వచ్చిన బంధువులు, అతిథులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెళ్లి పందిరి కాస్త రచ్చబండగా మారడంతో స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని గొడవను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. బాధితుడు శ్రావణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గృహహింస కేసులు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, ఇలా వివాహ వేడుకలో చొరబడి దాడులకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.












