రాష్ట్రంలో మరోమారు టెస్సరాక్ట్ కంపెనీ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్గా ఉన్న ఈ కంపెనీతో ఇజ్రాయెల్ ప్రతినిధులు తాజాగా ఒప్పందాలు చేసుకున్నారని, అలా ఎలా సాధ్యం అయ్యిందని బీఆర్ఎస్ కీలక నేతల మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డికి కీలక ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేశారు.
సీఎం రేవంత్ చెప్పడం వల్లే ఇజ్రాయెల్ ప్రతినిధులు కొండల్ రెడ్డి కంపెనీ అయిన టెస్సెరాక్ట్తో ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ సంవత్సరం దావోస్కి వెళ్లి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ వాళ్లని కలిశారని, వాళ్లు అనుముల కొండల్ రెడ్డి చైర్మన్గా ఉన్న టెస్సెరాక్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. అప్పుడే ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారితో రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కూడా భేటీ అయ్యాడని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం టెస్సెరాక్ట్ కంపెనీకి తక్కువ ధరకే రూ.వేల కోట్ల విలువైన భూములు కట్టబెడితే.. మంత్రి శ్రీధర్ బాబు వచ్చి కొండల్ రెడ్డికి, టెస్సెరాక్ట్ కంపెనీకి ఏం సంబంధం లేదని అంటున్నాడని వివరించారు. కొండల్ రెడ్డి ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ అనే కొత్త కంపెనీకి కూడా చైర్మన్ అయ్యాడని, ఆయన అంత పెద్ద సైంటిస్టా మరి? అని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
గతంలో ఇజ్రాయెల్తో ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రధాని మోడీని రాహుల్ గాంధీ ప్రశ్నించారని, మరి ఇప్పుడు మీ పార్టీ ముఖ్యమంత్రి తమ్ముడు ఇజ్రాయెల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాడని దానికి ఏం సమాధానం చెబుతారని రాహుల్ను సైతం నిలదీశారు.
రేవంత్ రెడ్డి,ఆయన సోదరుడు అనుముల కొండల్ రెడ్డి, ఫహీం కురేషి విదేశీ పర్యటనలకు వెళ్లి అక్కడ ఏం వ్యాపారాలు చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని ఈ సందర్బంగా క్రిశాంక్ డిమాండ్ చేశారు. తెలంగాణకు ఏమో ఒక్క కంపెనీ రాదని, రేవంత్ రెడ్డి తమ్ముడు అనుముల కొండల్ రెడ్డి ఏ దేశానికి పోయినా ఆయనతో మాత్రం అక్కడ అధికారులు ఒప్పందాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. హవాలానా, షెల్ కంపెనీలా, నల్లధనమా?.. దేనికోసం వెళ్తున్నారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.











