చైనా నుంచి వస్తున్న విపరీతమైన గిరాకీ కారణంగా పాకిస్థాన్లో గాడిదల వ్యాపారం ఊపందుకుంది. గాడిద మాంసం, దాని చర్మంతో తయారు చేసే సంప్రదాయ ఔషధాల కోసం చైనా నుంచి భారీ డిమాండ్ ఉండటంతో పాకిస్థాన్ ఇప్పుడు వాటిని పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఒక భారీ స్లాటర్ హౌస్లో రోజూ వందల సంఖ్యలో గాడిదలను వధిస్తూ, వాటి మాంసం, చర్మాలను చైనాకు తరలిస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్టును 'హ్యాంగెంగ్ గ్రూప్' (Hangeng Group) అనే చైనా కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం రోజూ వందల సంఖ్యలో గాడిదలను వధిస్తుండగా, త్వరలోనే ఈ సామర్థ్యాన్ని రోజుకు 800కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ వ్యాపారం ద్వారా రాబోయే ఆరు నెలల్లో నెలకు సుమారు 5 మిలియన్ డాలర్లు (రూ. 47 కోట్లు), రెండేళ్లలో నెలకు 7 మిలియన్ డాలర్ల (రూ. 67 కోట్లు) విదేశీ మారకాన్ని ఆర్జించవచ్చని అంచనా వేస్తున్నారు.
హ్యాంగెంగ్ గ్రూప్ ఈ ప్రాజెక్టు కోసం సుమారు 50 మిలియన్ డాలర్లు (రూ. 480 కోట్లు) పెట్టుబడి పెట్టగా, దీనివల్ల స్థానికంగా 500 మందికి ఉపాధి లభిస్తోంది. మత విశ్వాసాల కారణంగా పాకిస్థాన్లో గాడిద మాంసాన్ని తినరు, కానీ చైనాలో దీనికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా గాడిద చర్మం నుంచి 'ఇజియావో' (Ejiao) అనే కొలాజెన్ ఔషధాన్ని తయారు చేయడానికి చైనా కంపెనీలు ఈ దిగుమతులపై ఆధారపడుతున్నాయి.
పాకిస్థాన్ ఎకనమిక్ సర్వే ప్రకారం దేశంలో 6 మిలియన్లకు పైగా గాడిదలు ఉండటంతో, ఈ భారీ సంఖ్యను ఆర్థిక వనరుగా మార్చుకునేందుకు పాక్ ప్రభుత్వం గ్వాదర్ ఫ్రీ జోన్ నుంచి ఎగుమతులకు అధికారిక అనుమతులు ఇచ్చింది. ఆఫ్రికా దేశాలు గాడిద చర్మాల ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో, చైనాకు కీలక సరఫరాదారుగా పాకిస్థాన్ అవతరిస్తోంది.











