గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. భారత అథ్లెట్లు మరోసారి అద్భుత ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా బాక్సింగ్లో భారత బాక్సర్లు సత్తా చాటుతూ ఏకంగా 10 పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ విజయాలతో భారత్ మొత్తం 39 పతకాలతో పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ ఖాతాలో ప్రస్తుతం 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఈసారి భారత్కు రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ వంటి క్రీడలు పోటీల్లో లేకపోయినా.. మిగతా విభాగాల్లో భారత క్రీడాకారులు అంచనాలకు మించి రాణిస్తూ పతకాల వేటను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. బాక్సింగ్తో పాటు ఇతర విభాగాల్లోనూ భారత అథ్లెట్లు నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ దేశ ప్రతిష్ఠను ప్రపంచ వేదికపై మరింత పెంచుతున్నారు. ప్రస్తుతం భారత బృందం మరిన్ని పతకాలపై గురిపెట్టి పోటీల్లో ముందుకు సాగుతోంది.
మరోవైపు వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను భారత్కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. మహిళల 48 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణం కైవసం చేసుకుంది. అంతకుముందు పారా పవర్లిఫ్టింగ్లో జండూ కుమార్ కాంస్య పతకం సాధించి ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల ఖాతా తెరిచాడు. పారా అథ్లెటిక్స్లో శర్మిలా ధంకర్, దిలీప్ గవిత్, సోమన్ రాణా స్వర్ణ పతకాలు సాధించగా.. జూడోలో అస్మితా దే, హర్ష్ సింగ్ బంగారు పతకాలు గెలిచి భారత్కు విజయాలు అందించారు.
అదేవిధంగా భారత్ ఆధిపత్యం బాక్సింగ్లో కూడా స్పష్టంగా కనిపించింది. మహిళల విభాగంలో ప్రీతి పవార్, జాస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్, అరుంధతి చౌదరి స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో సచిన్ సివాచ్, అంకుష్ పంఘాల్ గోల్డ్ మెడల్స్ గెలిచి భారత పతకాల సంఖ్యను మరింత పెంచారు. రజత పతకాల విభాగంలో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో సీజన్ బెస్ట్ 85.83 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు.
అలాగే లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్, ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్, హైజంప్లో సర్వేశ్ కుషారే, వెయిట్లిఫ్టింగ్లో రిషికాంత్ సింగ్, ముత్తుపాండి రాజా, జ్ఞానేశ్వరి యాదవ్, హర్జిందర్ కౌర్, లవ్ప్రీత్ సింగ్, అజయ బాబు రజత పతకాలు సాధించారు. యశ్వీర్ సింగ్ జావెలిన్ త్రోలో, తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్లో, గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల పరుగులో, సెల్వ ప్రభు ట్రిపుల్ జంప్లో, సీమ కలిరమణ డిస్కస్ త్రోలో, బింద్యారాణి దేవి వెయిట్లిఫ్టింగ్లో, శిల్పా శైలా పారా అథ్లెటిక్స్లో, ఉన్నతి శర్మ జూడోలో, జండూ కుమార్ పారా పవర్లిఫ్టింగ్లో కాంస్య పతకాలు గెలిచారు.
ఇక గుల్వీర్ సింగ్ ఒకే కామన్వెల్త్ గేమ్స్లో అథ్లెటిక్స్ విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్గా నిలిచాడు. మరోవైపు తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్లో భారత్కు తొలి కామన్వెల్త్ పతకాన్ని అందించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. గేమ్స్ ముగింపు దశకు చేరుకున్న వేళ జూడో, ట్రాక్ సైక్లింగ్ వంటి విభాగాల్లో భారత్కు మరిన్ని పతకాల అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం 39 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతున్న భారత్.. 40కి పైగా పతకాలతో ఈ టోర్నీని ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా పది రోజుల పాటు ప్రపంచ స్థాయి పోటీలతో క్రీడాభిమానులను అలరించిన కామన్వెల్త్ గేమ్స్ నేటితో ముగియనున్నాయి. భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శన దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపగా.. చివరి రోజు కూడా మరిన్ని పతకాలపై అందరి దృష్టి నెలకొంది.












