తెలంగాణను గ్రీన్ ఎనర్జీ (హరిత ఇంధన) హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి నేడు(గురువారం) రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పరిధిలోని సీతారాంపూర్లో భారీ పెట్టుబడులతో నూతనంగా నిర్మించిన పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, కొత్త పనుల శంకుస్థాపనల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని, ఉపాధి అవకాశాలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
ఈ పర్యటనలో భాగంగా సీతారాంపూర్లో ప్రతిష్టాత్మకంగా సిద్ధమైన 'ప్రీమియర్ ఎనర్జీస్' సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించనున్నారు. దేశీయ సౌరశక్తి రంగంలో ఈ యూనిట్ అత్యంత కీలకంగా మారనుంది. దీనితో పాటు, భవిష్యత్ విద్యుత్ అవసరాల కోసం ఎంతో కీలకమైన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ప్రాజెక్టుకు, అలాగే ఇక్కడే నూతనంగా నిర్మించ తలపెట్టిన భారీ అల్యూమినియం ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు జరగనున్నాయి.
ఒకే రోజు ఒకే వేదికపై నుంచి క్లీన్ ఎనర్జీ, ఉత్పాదక రంగాలకు చెందిన మూడు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతుండటంతో రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. సీఎం పర్యటనను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సంయుక్తంగా సీతారాంపూర్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేశారు.












