National

బహుభార్యత్వంపై అసోం కొరడా.. పథకాలు కట్.. ఉద్యోగాలూ ఊస్ట్ !

రచన: Mamatha puppala3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని పూర్తిగా అరికట్టేందుకు అసోం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న పురుషులకు ఇకపై ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని పూర్తిగా అరికట్టేందుకు అసోం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న పురుషులకు ఇకపై ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ నిబంధనను ఉల్లంఘించే ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని తేల్చిచెప్పింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ కీలక ప్రతిపాదనలను పొందుపరిచింది.

రాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత మల్లా బారువా శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఈ వివరాలను వెల్లడించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భార్యలను కలిగిన ఏ పురుషుడైనా ప్రభుత్వ పథకాలకు అనర్హుడవుతాడని ఆయన సభకు వివరించారు. మహిళా సాధికారతను పెంపొందించడం, సమాజంలో లింగ సమానత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే 'అసోం సర్వీసెస్ రూల్స్-1964'కు అవసరమైన సవరణలు చేయనున్నట్లు పేర్కొనగా.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ధృవీకరించారు.

షెడ్యూల్డ్ తెగలకు మినహాయింపు..

బహుభార్యత్వాన్ని నిర్మూలించేందుకు అసోం ప్రభుత్వం గత కొంతకాలంగా అత్యంత కఠినమైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే 2025 నవంబర్‌లోనే "అసోం బహుభార్యత్వ నిషేధ బిల్లు, 2025"ను అసెంబ్లీలో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. మొదటి భార్య బతికుండగా, ఆమెకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం తీవ్రమైన నేరం. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడేలా నిబంధనలు రూపొందించారు. అయితే, అక్కడి కొన్ని షెడ్యూల్డ్ తెగలకు, ఆరో షెడ్యూల్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు మాత్రం ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు.

#Assam Government#Polygamy Ban#Assam Budget 2026#Himanta Biswa Sarma#Welfare Schemes#Assam Services Rules
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి