సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్లో భారీగా ఆర్మీ ఆయుధాలు చోరికి గురైన విషయం తెలిసిందే.ఘటన జరిగి రెండు వారాలు దాటింది. ఈ కేసులో ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు, రాష్ట్ర పోలీసులు ఉమ్మడిగా విచారణ జరుపుతున్నారు.దీంతో ఈ కేసు కీలక ములుపు తిరిగింది. ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు నలుగురు గార్డులను సైతం ఉన్నతాధికారులు విచారించారు.
వారు అందించిన సమాచారం మేరకు తాజాగా ముగ్గురు సీనియర్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం వారిని ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్టు తెలిసింది. ఆర్మీ రెజిమెంట్ శిక్షణా కేంద్రంలో వినియోగించే ఆయుధాలు, బుల్లెట్లకు ఎలాంటి ప్రత్యేక కోడింగ్ నంబర్లు ఉండవని సమాచారం. ఈ విషయం గుర్తించిన నిందితులు పక్కా పథకం ప్రకారమే విడతల వారీగా భారీగా ఆయుధాలు, బుల్లెట్లు చోరీ చేసినట్లు విచారణలో తేలింది.
అయితే, ఈ వ్యవహారంలో ఆర్మీ సీనియర్ అధికారులు హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.మద్రాస్ రెజిమెంటులో వెపన్స్ చోరీ ఒక్కరోజులో జరిగింది కాదని, మూడు నెలలుగా పక్కా వ్యూహంతో ఒక్కొక్కటిగా మాయం చేసినట్లు తెలుస్తోంది.అత్యాధునిక ఆయుధాలైన ఏకే-203 రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్, పిస్టల్స్ సహా 12 ఆయుధాలను పలు దఫాలుగా బయటకు తరలించినట్టు తెలిసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సీసీ కెమెరాలను నిలిపివేసి.. డ్యూటీలో ఉన్న గార్డులను ఇతర పనుల కోసం పంపించి ఆయుధాలను తరలించినట్టు సమాచారం.
https://x.com/pulsenewsbreak/status/2097898278566433016?s=20
ఈ క్రమంలోనే అనుమానితుల జాబితాను ఆర్మీ అధికారులు సిద్ధం చేయగా, మల్కాజిగిరి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.మద్రాస్ రెజిమెంట్కు చెందిన ఓ ఆర్మీ అధికారిని వారం రోజులుగా విచారిస్తున్నట్లు తెలిసింది.అనుమానితులను అన్ని కోణాల్లో దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తుంచిన అనంతరం ఢిల్లీకి తరలించినట్టు తెలిసింది. రెజిమెంట్తో పాటు సమీప ప్రాంతాల్లోని వందలాది సీసీ కెమెరాల పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆయుధాలను ఎక్కడికి తీసుకెళ్లారు..ఎవరికి అందజేశారు.. దీని వెనుక ఏమైనా ఉగ్రకుట్ర ఉందా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.












