రాష్ట్రంలో కాంగ్రెస ప్రభుత్వం పడిపోవడానికి, వర్షాలు కురవకుండా ఉండేందుకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సైతం ఓ సభలో మాట్లాడుతూ.. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్ రావు కర్ణాటక ఎందుకు వెళ్లారని, ఆ విషయం బహిర్గతం చేయాలని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాజకీయాల్లో విమర్శలకు హద్దు పద్దు ఉంటుందని, బట్ట కాల్చి మీద వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములు బయటపెడుతున్నాననే తనను టార్గెట్ చేశారని, గతంలో కొండా సురేఖ అడ్డగోలుగా మాట్లాడి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని గతంలో వ్యాఖ్యానించారు. తన మీద నిరాధార ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీద క్రిమినల్ సూట్, డిఫమేషన్ సూట్ కూడా వేస్తానని హెచ్చరించారు.

ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా ఇచ్చినట్టు పేర్కొన్నారు.నాలుక ఉందని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని గతంలో హెచ్చరించారు. ఈ క్రమంలోనే హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని నిరాధార ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశించింది.
https://x.com/TeluguScribe/status/2097731047467426242?s=20
మాజీమంత్రి హరీష్ రావుపై బహిరంగంగా “బ్లాక్ మేజిక్”, “క్షుద్ర పూజలు” ఆరోపణలు చేసిన వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేశారు.దీంతో ఫిర్యాదును స్వీకరించిన NHRC.. నాలుగు వారాల్లోగా “యాక్షన్ టేకెన్ రిపోర్ట్” సమర్పించాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని నోటీసుల్లో పేర్కొంది. ఇదిలాఉండగా, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీద డీజీపీ చర్యలు తీసుకుంటారా? లేదా రాతపూర్వక వివరణ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.













