కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రం. సప్తగిరుల నడుమ వెలసిన స్వామివారి రూపాన్ని, నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే ఆలయ శోభను తిలకించడం జన్మధన్యం. ఇక్కడ నెలకొన్న ప్రశాంతమైన వాతావరణం, ప్రతీ భక్తుడికి దివ్యానుభూతిని ఇస్తాయి. వేలాది ఏళ్లుగా అశేష జనవాహినిని ఆకర్షిస్తూ, సమస్త మానవాళికి ఆధ్యాత్మిక వెలుగునిచ్చే అద్భుతమైన క్షేత్రం మన తిరుమల అని చెప్పడంలో సందేహం లేదు..
ఇంతటి విశేషమైన తిరుమల ఆలయాన్ని మొదట ఎవరు కట్టారు? అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. మనం చరిత్రను మాత్రమే కాదు.. తిరుమల క్షేత్ర మహిమను కూడా తెలుసుకోవాలని పండితులు చెబుతున్నారు..
ఇక పురాణ సంప్రదాయం ప్రకారం.. వేంకటాచలం సాధారణ పర్వతం కాదు. శ్రీమహావిష్ణువు వరాహస్వామి రూపంలో ఈ క్షేత్రంలో వెలసిన తర్వాత.. కలియుగంలో శ్రీనివాసుడిగా వేంకటాద్రిపై అవతరించారని వేంకటాచల మహాత్మ్యం, వరాహ పురాణం వంటివి వివరిస్తాయి.
తిరుమలలో మొదట వరాహస్వామికి ప్రాధాన్యం ఉందని, ఆయన అనుమతితో శ్రీనివాసుడు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాడని స్థలపురాణం చెబుతుంది. అయితే.. ఈ రాజే తిరుమల ఆలయాన్ని మొదట నిర్మించాడని నిర్ధారించే ఆధారాలు లేనట్టు తెలుస్తుంది. ఇక చారిత్రకంగా చూస్తే.. తిరుమల ఆలయ అభివృద్ధి ఒక్కసారిగా జరగలేదు. పల్లవుల కాలం నుంచి ప్రారంభమైన నిర్మాణ, కైంకర్య పరంపర.. చోళులు, పాండ్యులు, యాదవరాయులు, విజయనగర రాజుల కాలంలో క్రమంగా విస్తరించింది.
ఇందులో పల్లవ రాణి సామవై పెరుందేవి చేసిన కైంకర్యం ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. శాసనం ప్రకారం ఆమె శ్రీభోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించి.. నిత్య కైంకర్యాలు, ఉత్సవాల కోసం దానాలు చేసిందని అంటారు.. ఆ తర్వాతి శతాబ్దాల్లో రాజులు మారినా.. స్వామివారి సేవ మాత్రం ఆగలేదు. చోళులు, పాండ్యులు, యాదవరాయుల కాలంలో నైవేద్యాలు, దీపారాధనలు, ఉత్సవాలు, దానధర్మాలు కొనసాగాయి.
విజయనగర సామ్రాజ్య కాలంలో మాత్రం తిరుమల ఆలయ వైభవం మరింత విస్తరించిందని పురాణాలు చెబుతాయి. గోపురాలు, ప్రాకారాలు, మండపాలు, ఆభరణాలు, గ్రామ దానాలు.. ఇలా శ్రీవారి క్షేత్రం మహోన్నత రూపాన్ని సంతరించుకుంది. అందులో శ్రీకృష్ణదేవరాయల భక్తి ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఆయన తిరుమల స్వామివారికి అనేక కానుకలు, ఆభరణాలు సమర్పించినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి.
అందుకే.. తిరుమల గుడిని ఒక్క రాజు కట్టించాడు అనడం కంటే.. తరతరాలుగా రాజులు, భక్తులు చేసిన కైంకర్యాలతో ఆలయం రూపుదిద్దుకుందని పేర్కొంటారు.. ఇలా పురాణం మనకు వేంకటాద్రి దివ్యత్వాన్ని చెబుతుంది.. ఇక్కడి శాసనాలు ఆ దివ్యక్షేత్రానికి జరిగిన కైంకర్యాల చరిత్రను చెబుతున్నాయి. రాజులు వచ్చారు.. సామ్రాజ్యాలు పోయాయి..
కానీ ఏడు కొండలపై స్వామివారి సన్నిధి మాత్రం కొనసాగుతూనే ఉంది. అందుకే తిరుమల కేవలం రాళ్లతో నిర్మించిన ఆలయం కాదు.. భక్తితో తరతరాలు నిర్మించుకుంటూ వచ్చిన ఆధ్యాత్మిక వారసత్వం అని పండితులు అంటారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.









