Petrol-Diesel Price : పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అగ్రరాజ్యం అమెరికా - ఇరాన్ మధ్య దాడులు మరోసారి తీవ్రరూపం దాల్చడంతో వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధి పరిధిలో వాణిజ్య నౌకల రాకపోకలపై ప్రభావం పడుతోంది. చమురు ట్యాంకర్లు, ఇతర సరుకు రవాణా నౌకలపై దాడుల వార్తలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో మరోసారి ఆందోళన పెంచుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటింది.
బ్రిటిష్ నేవీకి అనుబంధంగా పనిచేసే యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ప్రకారం.. ఉత్తర అరేబియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో పలు వాణిజ్య నౌకలు దాడులకు గురయ్యాయి. వాటిపై జరిగిన కాల్పులు, ఇతర సైనిక చర్యల కారణంగా నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరాక్ జలాల్లో చమురు రవాణా చేస్తున్న ఓ ట్యాంకర్ డ్రోన్ కూడా దాడికి గురైంది. మరోవైపు యూఏఈలోని పోర్ట్ రషీద్ సమీపంలో ఓ నౌక ఒకవైపుకు ఒరిగిపోయిన ఘటన చోటుచేసుకుంది.
ముడి చమురు ధరలపై ప్రభావం
హార్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించిన తర్వాత, ఇరాన్ కూడా పలు నౌకలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఇరుపక్షాల మధ్య ఈ దాడులు, ప్రతి దాడులు సముద్ర రవాణాపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ తన ముడి చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు ఎక్కువకాలం ఇదే స్థాయిలో కొనసాగితే దిగుమతి బిల్లుపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణంపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా?
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినంత మాత్రాన దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే పెరుగుతాయని చెప్పలేం. అయితే హార్ముజ్లో పరిస్థితులు మరింత ముదిరి, ముడి చమురు ధరలు ఎక్కువకాలం అధిక స్థాయిలో కొనసాగితే దేశీయ ఇంధన ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. అదే జరిగితే వాహనదారులతో పాటు రవాణా రంగం, సరుకు ధరలపై కూడా ఈ ప్రభావం పడొచ్చు. అందుకే హార్ముజ్ పరిణామాలను భారత్తో పాటు ప్రపంచ ఇంధన మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి.








