TG : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్కు నాంపల్లి కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయనకు కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. షూరిటీలు సమర్పించిన తర్వాత సుమంత్ను ముందస్తు బెయిల్పై రిలీజ్ చేయాలని దర్యాప్తు అధికారికి సూచించింది.
కేసు దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి అవసరమైనప్పుడు పిలిచిన వెంటనే హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు సంబంధించిన వివరాలను ప్రభావితం చేసేలా ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని తెలిపింది.
అలాగే కేసులోని ప్రత్యక్ష, పరోక్ష సాక్షులను ప్రభావితం చేయడం, వారిని ప్రలోభపెట్టడం లేదా బెదిరించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని కోర్టు షరతు విధించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు కేసుకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.
మరో కీలక నిబంధనగా.. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా సుమంత్ దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. తన మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్ వంటి వివరాలను దర్యాప్తు అధికారికి అందించాలని సూచించింది. అడ్రస్ లేదా తనను అప్రోచ్ అయ్యే వివరాల్లో ఏదైనా మార్పు జరిగితే అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
ఇటీవల సుమంత్పై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. గొంగడి హరికృష్ణ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు తనతో పాటు మరికొందరిపై కేసు ఫైల్ చేశారు. ఇనుప రాడ్లతో తనపై దాడి చేసినట్లు హరికృష్ణ తన ఫిర్యాదులో ఆరోపించారు. బీఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.
కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురిని పోలీసులు విచారించినట్లు సమాచారం. సుమంత్తో ఇతర నిందితులకు ఉన్న సంబంధం, ఘటన వెనుక కారణాలు, ఇందులో ఎవరి పాత్ర ఎంత అనే అంశాలపై అధికారులు ఆరా తీశారు. ఇప్పుడు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో సుమంత్కు తాత్కాలికంగా ఊరట లభించినట్టైంది. అయితే కోర్టు విధించిన అన్ని షరతులను అతను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.








