Railway Multitracking Projects: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని రద్దీ మార్గాలతో సహా దేశవ్యాప్తంగా పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలు వెల్లడించారు.
తెలంగాణలోని ఘట్కేసర్-కాజీపేట మధ్య నాలుగో లైను నిర్మాణానికి ఆమోదం లభించింది. 110 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు రూ. 2,419 కోట్లు కేటాయించింది. ఇప్పటికే సికింద్రాబాద్-వాడి మధ్య 4 లేన్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగే అరక్కోణం-రేణిగుంట మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికీ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 8 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. మొత్తం 7 రైల్వే కారిడార్లలో 4 లైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 10,021 కోట్లుగా పేర్కొంది. ఇందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. 8 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుల్లో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక పరిధిలోని 17 జిల్లాలను కలుపుతూ 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్ పనులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త లైన్ల నిర్మాణంతో రైల్వే నెట్వర్క్ సామర్థ్యం పెరగనుంది. ఆయా మార్గాల్లో రైళ్ల రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి. రద్దీ భారీగా తగ్గనుంది. సరుకు రవాణ సామర్థ్యం కూడా పెరగనుంది.










