Alleti Maheshwar Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదికగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయడంపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని సభ్యులను సైతం సస్పెండ్ చేయడం గతంలో ఎన్నడూ లేని పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా శాసనసభలో మాట్లాడిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి .. సభా నిబంధనల ఉల్లంఘన జరిగితే ప్రశ్నించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అయితే, కొందరు సభ్యులను ఇష్టానుసారంగా సస్పెండ్ చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. “ఏ పుస్తకం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు? కొత్తగా రేవంత్ రెడ్డి రూల్ బుక్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా?” అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రజలకు సంబంధించిన కీలక అంశాలను చర్చించాల్సిన సమయంలో అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా 22ఏ నిషేధిత భూముల సమస్య, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 22ఏ అంశంపై బీజేపీ ఇప్పటికే అసెంబ్లీలో చర్చకు పట్టుబడుతోంది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఏడు గంటలు కూడా విద్యుత్ సరఫరా అందడం లేదని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇన్ని సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన ఈ సభలో సస్పెన్షన్ల అంశం ప్రధానంగా మారడం సరైనది కాదన్నారు.
కాగా, అసెంబ్లీ సమావేశాల మూడో రోజు బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్రావు సహా పలువురు ఎమ్మెల్యేలను సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించగా.. ప్రభుత్వం మాత్రం సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగిస్తున్నందునే చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది.










