సినిమా

Fake Collection Posters : వచ్చింది గోరంత.. పోస్టర్‌పై కొండంత! టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్ల లొల్లి?

రచన: Mahesh10 నిమిషాల పఠనం

Fake Collection Posters : సినిమా హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? అనే చర్చ కంటే.. ఎంత వసూలు చేసింది? అనేదే ఇప్పుడు బాక్సాఫీస్ చర్చల్లో కీలకంగా మారిపోయింది. థియేటర్లలో వచ్చే కలెక్షన్స్ కంటే సోషల్ మీడియాలో కనిపించే పోస్టర్లలోని అంకెలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు తరచూ వినిపిస్తున్నాయి.

Fake Collection Posters : సినిమా హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? అనే చర్చ కంటే.. ఎంత వసూలు చేసింది? అనేదే ఇప్పుడు బాక్సాఫీస్ చర్చల్లో కీలకంగా మారిపోయింది. థియేటర్లలో వచ్చే కలెక్షన్స్ కంటే సోషల్ మీడియాలో కనిపించే పోస్టర్లలోని అంకెలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు తరచూ వినిపిస్తున్నాయి. వచ్చిన మొత్తం ఒకటైతే.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రచారంలో చూపించే నెంబర్స్ మరో స్థాయిలో ఉంటోందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

అసలు ఒక సినిమా ఎంత సంపాదించింది అన్నది చెప్పడానికి కలెక్షన్ పోస్టర్ ఒక ఉదాహారణ మాత్రమే. కానీ అదే ప్రచారానికి ప్రధాన ఆయుధంగా మారినప్పుడు అసలు సమస్య మొదలవుతుందనే అభిప్రాయం ఉంది. స్టార్ హీరో సినిమా అయితే వసూళ్లను భారీగా చూపించడం, ఓపెనింగ్‌ నంబర్లను పెంచి చెప్పడం, మైలురాళ్లను వేగంగా చేరుకున్నట్టు ప్రచారం చేయడం.. ఇవన్నీ ఇప్పుడు నార్మల్ ప్రమోషనల్ స్ట్రాటజీగా మారిపోయాయనే చర్చ జోరుగా సాగుతోంది.

ఎందుకీ అంకెల ఆట?

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు, అభిమానులు.. బాక్సాఫీస్ నంబర్లను తమదైన కోణంలో చూస్తుంటారు. ఒక సినిమా సక్సెస్ అయ్యిందనే టాక్‌ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే ఈ నంబర్స్ బలంగా ఉపయోగపడతాయని ట్రేడ్ వర్గాల్లో కొందరి అభిప్రాయం. ముఖ్యంగా ఓపెనింగ్ రోజుల్లోనే సినిమాపై పాజిటివ్ బజ్ తీసుకురావడానికి ఈ నంబర్లే కీలకంగా మారుతాయనే వాదన కూడా ఉంది.

మరోవైపు.. ఒక హీరో మార్కెట్‌ను నిలబెట్టుకోవడం, నెక్ట్స్ సినిమాకు బిజినెస్ పెంచుకోవడం, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపడం వంటి కారణాలు కూడా ఈ ఫేక్ పోస్టర్ల ధోరణి వెనుక ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. అసలు నిజంగా వచ్చిన మొత్తం కలెక్షన్స్‌ను మాత్రమే బయటికి ప్రకటిస్తే మేకర్స్‌కి వచ్చే నష్టం ఏమిటి? అన్నదే ఇప్పుడు నార్మల్ ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న ప్రశ్న.

గతంలో నిర్మాతలు ఏం చెప్పారంటే..

కలెక్షన్స్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై గతంలో పలువురు ప్రముఖ నిర్మాతలు కూడా స్పందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ ఒక సందర్భంలో మాట్లాడుతూ.. మీడియాకు వెల్లడించే బాక్సాఫీస్ నంబర్లు అసలైన లెక్కలుగా కాకుండా అంచనాలు, స్పెక్యులేషన్ ఆధారంగా ఉండొచ్చని కామెంట్స్ చేశారు. తమ బిజినెస్‌కి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.

నిర్మాత దిల్ రాజు సైతం గతంలో హీరోల మార్కెట్, అభిమానుల అంచనాలు, ఇండస్ట్రీలోని ఒత్తిళ్ల కారణంగా కొన్ని సందర్భాల్లో పెద్ద నంబర్లను ప్రచారంలో చూపించాల్సి వస్తుందని కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇన్నాళ్లుగా బయట వినిపిస్తున్న అనుమానాలకు నిర్మాతల వ్యాఖ్యలతో మరింత బలం చేకూర్చినట్టయింది. అంటే.. ఈ వ్యవహారం పూర్తిగా కొత్తదేమీ కాదని, పరిశ్రమలోనే ఈ అంశంపై చర్చ చాలాకాలంగా ఉందని చెప్పొచ్చు.

పోస్టర్ ఒకటి.. థియేటర్ లెక్క మరోటి?

ఒక సినిమా పోస్టర్‌పై రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.500 కోట్లు అంటూ అంకెలు కనిపిస్తే ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆ సంఖ్య ఎలా వచ్చింది? గ్రాస్ ఎంత? షేర్ ఎంత? ఏ ప్రాంతం నుంచి ఎంత వచ్చింది? ఓవర్సీస్ లెక్కలు ఎలా ఉన్నాయి? నిర్మాతకు తిరిగి వచ్చిన మొత్తం ఎంత? అనే ప్రశ్నలకు మాత్రం చాలాసార్లు స్పష్టమైన సమాధానాలు కనిపించవనే అభిప్రాయాలు సినీ వినిపిస్తున్నాయి.

ఇప్పటి సినిమా ప్రమోషన్‌లో సోషల్ మీడియా పాత్ర విపరీతంగా పెరిగింది. ‘ఫస్ట్ డే’, ‘ఫాస్టెస్ట్’, ‘బిగ్గెస్ట్’, ‘రికార్డ్ బ్రేకింగ్’ అంటూ వరుస పోస్టులు వస్తుంటాయి. ఒక హీరో అభిమానులు తమ నటుడు ఒక రికార్డు సాధించాడని చెప్పుకోవడం.. మరో స్టార్ ఫ్యాన్స్ ఆ రికార్డ్‌ను తమ హీరో అధిగమించిందని ప్రచారం చేయడం.. ఇలా నంబర్ల చుట్టూ ఫ్యాన్ వార్ కూడా నడుస్తోంది.

ఇక్కడే మేకర్స్‌పై కూడా ఒత్తిడి పెరుగుతోందనే అభిప్రాయం ఉంది. ఒక హీరోకు గత చిత్రం భారీ నంబర్ ఇచ్చిందని ప్రచారం జరిగితే.. తర్వాతి సినిమాకు అంతకంటే పెద్ద ఫిగర్ చూపించాలనే అంచనాలు ఏర్పడుతున్నాయి. అలా మొదలైన పోటీ చివరకు ఎక్కడికి దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రశ్న.

ఈ ట్రెండ్ కేవలం బాక్సాఫీస్ దగ్గరే ఆగిపోలేదనే విమర్శలు ఉన్నాయి. యూట్యూబ్ వ్యూస్, లైక్స్, ట్రెండింగ్ పొజిషన్లు, సోషల్ మీడియా రీచ్ విషయంలోనూ కృత్రిమంగా సంఖ్యలను పెంచుతున్నారనే ఆరోపణలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి.

ఇటీవలి కాలంలో ‘గేమ్ ఛేంజర్’, ‘అనగనగా ఒక రాజు’, ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’ తదితర చిత్రాలకు సంబంధించిన కలెక్షన్ పోస్టర్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చలు జరిపిన సందర్భాలు కనిపించాయి. అయితే ఈ చర్చ ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తోంది. కలెక్షన్ పోస్టర్లపై ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అనుమానాలు పెరుగుతున్నాయి.

ప్రణయ్ రెడ్డి వంగా కామెంట్స్‌తో మళ్లీ వేడెక్కిన చర్చ

ఇలాంటి సమయంలో భద్రకాళి పిక్చర్స్ అధినేత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తాజాగా రోమాంచకం సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి ఈ అంశాన్ని చర్చలోకి తీసుకొచ్చాయి. వాస్తవానికి మించి కలెక్షన్స్‌ను చూపించడం వల్ల హీరోలు, దర్శకులు, టెక్నీషియన్ల మార్కెట్‌పై లాంగ్ రన్‌లో నెగిటీవ్ ఇంప్యాక్ట్ పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

రేపటి రోజుల్లో మార్పు వస్తుందా?

ఒకప్పుడు సినిమా విజయాన్ని మౌత్ టాక్‌తో కొలిచేవారు. ఆ తర్వాత కలెక్షన్ పోస్టర్లు వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ రీచ్, సోషల్ మీడియా ట్రెండ్స్, బాక్సాఫీస్ మైల్ స్టోన్స్ కూడా విజయానికి ప్రమాణాలుగా మారాయి. అయితే వీటిలో ఏది వాస్తవం? ఏది ప్రచారం? అనే గీత చెరిగిపోకుండా ఉండాలంటే పారదర్శకత అవసరమనే వాదన బలపడుతోంది.

ఎందుకంటే ఒక పోస్టర్‌పై వందల కోట్లు చూపించడం ద్వారా ఒక్కరోజు సంబరాలు జరుపుకోవచ్చు. కానీ సినిమా నిజంగా ఎంత సంపాదించిందనే లెక్క మాత్రం కాలంతో బయటపడుతుంది. అందుకే ఇకపై ‘ఎంత చూపించారు?’ కంటే ‘ఎంత వచ్చింది?’ అనే ప్రశ్నకే విలువ పెరగాలంటున్నారు.

ఫేక్ నంబర్లతో తాత్కాలికంగా హైప్ తీసుకురావడం కంటే.. నిజమైన సక్సెస్, వాస్తవ లెక్కలతో సినిమా రిజల్ట్‌ను ప్రేక్షకుల ముందు ఉంచడమే పరిశ్రమకు దీర్ఘకాలంలో మేలు చేస్తుందనేది సాధారణ ఆడియన్స్ నుంచి, సినీ విశ్లేషకుల వరకు వినిస్తున్న అభిప్రాయం.

#Fake Collection Posters#Tollywood#Tollywood News#Box Office Collections#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి