ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి, రక్షణ రంగానికి సంబంధించి ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అత్యాధునిక రక్షణ, యుద్ధనౌకల తయారీ కేంద్రాన్ని (Warship Manufacturing Unit) ఏర్పాటు చేసేందుకు గోవా షిప్యార్డ్ లిమిటెడ్ (GSL) సన్నాహాలు చేస్తోంది. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 8,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు గోవా షిప్యార్డ్ ముందుకు రాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్ట్కు సోమవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ (SIPC) సమావేశంలో అధికారిక ఆమోదం లభించింది. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ తన సొంత రాష్ట్రం గోవా సరిహద్దులు దాటి మరో రాష్ట్రంలో నెలకొల్పుతున్న మొట్టమొదటి భారీ తయారీ కేంద్రం ఇదే కావడం విశేషం.

ఈ ప్రతిష్టాత్మక యుద్ధనౌకా నిర్మాణ రంగానికి రెండు దశల్లో మొత్తం 400 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. తొలి దశలో 198 ఎకరాలు, రెండో దశలో 195 ఎకరాల చొప్పున భూకేటాయింపులు జరగనున్నాయి. ఈ రక్షణ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో సుమారు 3,000 మందికి ప్రత్యక్షంగా, మరో 5,000 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నౌకా నిర్మాణం బహిరంగ ప్రదేశాల్లో సాగే ప్రక్రియ కావడం వల్ల గోవాలో వర్షాకాలం ఉన్నప్పుడు పనులకు తీవ్ర విఘాతం కలుగుతోందని, తూర్పు తీరంలో ఉన్న మచిలీపట్నంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వర్షపాత వ్యత్యాసాన్ని అధిగమించి ఏడాది పొడవునా ఉత్పత్తిని నిరంతరాయంగా కొనసాగించవచ్చని కేంద్ర అధికారులు వెల్లడించారు.
ప్రాజెక్ట్కు సంబంధించిన పర్యావరణ ప్రభావ అంచనా (EIA), వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) తయారీ పనులు వచ్చే నెల నుంచే వేగవంతం కానున్నాయి. ప్రణాళిక ప్రకారం 2027 అక్టోబర్లో యంత్రాల అమరిక, 2028 జనవరిలో ట్రయల్ ప్రొడక్షన్, అలాగే 2028 మే నాటికి మొదటి దశ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానున్నాయి. అనంతరం 2028 డిసెంబర్లో రెండో దశ పనులు చేపట్టనున్నారు. మొదట 2025 నవంబర్లో విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో రూ. 1,500 కోట్ల పెట్టుబడితో ఎంఓయూ కుదిరినప్పటికీ, తాజాగా ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ. 8,000 కోట్లకు పెంచడంతో మచిలీపట్నం భవిష్యత్తులో దేశంలోనే అత్యంత కీలకమైన రక్షణ మరియు నౌకా నిర్మాణ కేంద్రంగా మారనుంది.












