మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్లో గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. స్థానికులను ఉలిక్కిపడేలా చేశాయి. ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని ఓ టిఫిన్ సెంటర్లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మంటల తీవ్రతకు టిఫిన్ సెంటర్లోఉన్న గ్యాస్ సిలిండర్లు పేలినట్లు సమాచారం.
దీంతో మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫుడ్ కోర్టులకు వ్యాపించడంతో అవి కూడా పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ మూడు ఫుడ్ సెంటర్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తుండటంతో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.
మరోవైపు అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, ఆస్తి నష్టం వివరాల పై అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక అర్ధరాత్రి బోడుప్పల్లో జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినా.. మూడు ఫుడ్ సెంటర్లకు జరిగిన నష్టం మాత్రం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడికానున్నాయి..












