రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని గతంతో అనేక ఫిర్యాదులు వచ్చాయి. రద్దీ సమయాల్లో దొంగతనాలు, కొందరు పోకిరీలు మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడం వంటివి చేసేవారు. అక్కడ ఇక్కడ తాకుతూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవారు. దీనికితోడు ఇటీవలి కాలంలో ఆర్టీసీ సిబ్బందిపై కొందరు దాడులకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వాటి నుంచి బాధితులను రక్షించానికి సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని ప్యాసింజర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. సాధారణ ఆర్టీసీ బస్సుల్లో సీసీ టీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదని స్పష్టంచేశారు.కేవలం కార్పొరేషన్ అండర్లో నడుపుతున్న ప్రీమియం, ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రమే ప్రస్తుతం సీసీటీవీలను అందుబాటులోకి తెచ్చామని రవాణా శాఖ మంత్రి వెల్లడించారు.
గురువారం ఉదయం నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రశ్నోత్తరాల సమయంలో పలు పార్టీలకు సంబంధించిన శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు రవాణా శాఖ మంత్రి సమాధానాలు ఇచ్చారు. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 153 (AIS)ప్రకారం బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి కాదని తెలిపారు.
అనంతరం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. ఆర్టీసీ బస్సుల్లో సీసీటీవీల ఏర్పాటుపై గతంలోనూ ప్రతిపాదనలు వచ్చాయన్నారు. రిమోట్, సుదూర గ్రామాలకు నడిచే ఆర్టీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చే ప్రతిపాదన ఏమైన ఉందా? అని అడిగారు. అంతేకాకుండా, గణేష్ నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి సుమారు 50 నుంచి 60 లక్షల మంది భక్తులు వస్తారని, రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల నుంచి ఖైరతాబాద్ బడా గణపతి దర్శించుకునేందుకు ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. ఇప్పటికే నడుపుతున్నట్టు మంత్రి పొన్నం తెలపగా.. ఆర్టీసీ యాజమాన్యానికి ఎమ్మెల్యే దానం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఆర్టీసీ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నట్టు మంత్రి మరోసారి సభలో స్పష్టంచేశారు.












