సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ బిగ్షాక్ ఇచ్చింది. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ శాసనసభా సభ్యులను సస్పెండ్ చేయించిన ప్రభుత్వం.. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే సమావేశాలను కొనసాగిస్తున్నది. ప్రజాసమస్యలపై తాము ప్రశ్నిస్తున్నామనే మమ్మల్ని సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు నిన్నకీలక వ్యాఖ్యలు చేశారు. 22ఏ,ఫీజు రీయింబర్స్మెంట్, జీవో 97, యూరియా, సాగు నీరు, గోదావరి కృష్ణా జలాల దోపిడీ అంశంలో ప్రశ్నిస్తామనే భయంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు కలిసి సీఎం రేవంత్.. తన తమ్ముడు కొండల్ రెడ్డికి ఫోర్త్ సిటీలో కేటాయించిన టెస్సరాక్ట్ భూముల పరిశీలనకు వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఆర్థిక, భూ దోపిడీని ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడానికే వెళ్లామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
కొండల్ రెడ్డి కంపెనీ ‘టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్’కు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టిందని బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటవుతోన్న టెస్సెరాక్ట్ కంపెనీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి ప్రభుత్వం కేటాయించిన భూముల వ్యవహారంపై నిరసన తెలిపారు.
టెస్సరాక్ట్ కంపెనీ భూముల మీద సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందిచడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. రూ. వందల కోట్ల విలువైన భూమిని ఒక్క ఉద్యోగి కూడా లేని టెస్సరాక్ట్ కోసం ఎలా కేటాయిస్తారంటూ ప్రతిపక్షం మండిపడుతోంది. దీని వెనుక బడా కుంభకోణం దాగుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
https://x.com/pulsenewsbreak/status/2097925732760797422?s=20
టెస్సరాక్ట్ కంపెనీకి కొండల్ రెడ్డి డైరెక్టర్ కాదని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారని, మరి అలాంటప్పుడు సీఎం రేవంత్ ఇజ్రాయెల్ ప్రతినిధులతో చేసుకున్న ఒప్పందంలో అక్కడ సీఎం సోదరుడు కొండల్ రెడ్డి ఎందుకు ఉన్నాడంటూ బీఆర్ఎస్ నేత మన్నెక్రిశాంక్ ఇటీవల ప్రశ్నించిన విషయం తెలిసిందే.కాగా, టెన్సరాక్ట్ భూముల అంశంలో బీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ భూముల కేటాయింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












