ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులు సమర్పించిన అమ్మవారి బంగారు ఆభరణాల విషయంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే కానుకలపై గోల్డ్ అప్రైజర్లు చేతివాటం ప్రదర్శిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తులు ఇచ్చిన బంగారు ఆభరణాలను రసీదుల్లో తక్కువ తూకం చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలోనే గోల్డ్ అప్రైజర్ షమీపై తీవ్ర ఆరోపణలు రావడంతో, అప్పటి ఈవో శీనా నాయక్ ఆయనను సస్పెండ్ చేశారు. కానీ, ఇప్పుడు మళ్లీ అదే వ్యక్తి పునఃప్రవేశం చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గోల్మాల్పై సమగ్ర విచారణ జరిపించి, అసలు సూత్రధారులను తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఇంద్రకీలాద్రి మాత్రమే కాదు... ఈ మధ్య కాలంలో అనేక ప్రముఖ దేవాలయాల్లోనూ ఇటువంటి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం నుంచి, పలు దక్షిణభారత ఆలయాల్లోని వెండి ఆభరణాల మాయం, కానుకల లెక్కింపులో అవినీతి వరకు వరుస ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. దేవుడి పేరిట వచ్చే ఆదాయానికి, భక్తులు సమర్పించే కానుకలకు అసలు భద్రత లేకుండా పోతోందనే భావన వ్యక్తమవుతోంది. అవినీతికి పాల్పడిన అధికారులను కేవలం సస్పెండ్ చేసి మళ్లీ కొన్ని రోజుల తర్వాత విధుల్లోకి తీసుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయనే ఆరోపణలున్నాయి.
సస్పెన్షన్లు కేవలం కంటితుడుపు చర్యలుగా మారాయి తప్ప, భయాన్ని కలిగించలేకపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆలయ సొమ్మును దోచుకునే నిందితులపై కేవలం శాఖాపరమైన చర్యలకే పరిమితం కాకుండా, కఠినమైన చట్టాలు, లోతైన విచారణలతో జైలు శిక్షలు ఖరారు చేస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందనే భావన తలెత్తుతుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది..









