Cm Revanth: ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అద్భుతమైన పథకాలు అందిస్తే కొంతమంది దుర్మార్గులు, సన్నాసులు సర్కార్ విఫలమైంది, మంత్రివర్గం రాజీనామా చేయాలని ఊరూరా తిరుగుతున్నారు అంటూ ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. పండుగనాడు గంగిరెద్దులోళ్లు వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. విజ్ఞులైన ప్రజలు నాటి 10 సంవత్సరాల పాలనను, మా వెయ్యి రోజుల పాలనన బేరీజు వెయ్యాలని రేవంత్ కోరారు. వాళ్ళు ప్రజలకిచ్చిన హామీలను, మా కాంగ్రెస్ తెచ్చిన సంక్షేమాన్ని అంచనా వేయాలన్నారు. నకిరేకల్ లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు.
మీరు తెచ్చిన షాదీముబారక్, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను మీకంటే మెరుగ్గా ఇస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు.. నాలుగు విడతలుగా వడ్డీకే సరిపోయి రైతులు అప్పుల పాలయ్యారని చెప్పారు. రెండోసారి కేసీఆర్ ని సీఎం చేస్తే అసలు మిత్తి ఎగనామం పెట్టారని.. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుని నిధులు దిగమింగి దిగిపోయారని ఆరోపించారు.
''ఎన్నికల కమిషన్ ని అడ్డుపెట్టి రైతుభరోసా ఎగ్గొట్టి మోసం చేశారు. 2లక్షల రైతులకు రుణమాఫీపై చర్చకు సిద్ధం. 32 నెలల్లో 36 వేల కోట్లు రైతులకు బదిలీపై శాసనసభలో చర్చకు రండి. గిట్టుబాటు ధర ఇవ్వని మీరు వరి వేస్తే ఉరే అన్నారు. రైతుల ఆత్మగౌరవం నిలబెట్టిన ప్రభుత్వం మాది. 30 నెలల్లో 1.7 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేశాం. చేతనైతే శాసనసభకు రండి.. లెక్కలు తేల్చుకుందాం'' అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.









