SIR Effect: ఒక సర్టిఫికెట్ కోసం వెతుకులాట.. 35 ఏళ్లుగా దూరమైన అన్నను కలిపింది. SIR వెరిఫికేషన్ కోసం చిన్ననాటి స్కూల్ సర్టిఫికెట్ కావాల్సి రావడంతో తన పుట్టిన ఊరికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. పాత పాఠశాల సిబ్బంది సర్టిఫికెట్ కోసం ఆరా తీస్తుండగా.. అతడి కుటుంబ వివరాలు వెలుగులోకి వచ్చాయి. చివరకు 35 ఏళ్లుగా కనిపించని అన్న ఆచూకీ లభించింది. అన్నను కళ్లారా చూసిన క్షణంలో తమ్ముడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఓవైపు SIR వెరిఫికేషన్.. మరోవైపు ఏళ్లుగా దూరమైన రక్త సంబంధాన్ని కలిపిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. హృదయాలను హత్తుకుంటోంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై దేశవ్యాప్తంగా పలు విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది. హర్యానాలో వెలుగు చూసిన ఈ ఘటన మాత్రం ఈ ప్రక్రియకు అనుకోని మానవీయ కోణాన్ని జోడించింది. ఏకంగా 35 ఏళ్లుగా ఒకరికొకరు దూరంగా ఉన్న అన్నదమ్ములను SIR ప్రక్రియ తిరిగి కలిపింది.
పంజాబ్లో గత 35 ఏళ్లుగా నివసిస్తున్న సీతారామ్కు SIR ప్రక్రియలో భాగంగా తన బాల్యంలో చదువుకున్న పాఠశాలకు సంబంధించిన సర్టిఫికెట్ అవసరమైంది. సీతారామ్ తన చిన్నతనంలోనే స్వగ్రామాన్ని విడిచిపెట్టి పంజాబ్కు వెళ్లిపోయారు. అక్కడ వివిధ ప్రాంతాల్లో, పలు రకాల పనులు చేస్తూ జీవనం సాగించారు. కొంతకాలం ప్రైవేట్ పాఠశాలలో ప్యూన్గా కూడా పనిచేశారు. అనంతరం పంజాబ్లో గ్రూప్-డి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. ప్రస్తుతం దివ్యాంగుడైన సీతారామ్కు SIR ప్రక్రియలో అవసరమైన పాత పాఠశాల రికార్డు కోసం అవసరం అయ్యింది.
దీంతో హర్యానాలోని జింద్ జిల్లా మనోహర్పూర్ గ్రామంలోని తన పాత పాఠశాలను ఆయన సంప్రదించారు. సీతారామ్ అక్కడ చదువుకున్న వివరాలను ధ్రువీకరించేందుకు పాఠశాల సిబ్బంది రికార్డులను పరిశీలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో పాఠశాల సిబ్బంది ఆయన గుర్తింపు నిర్ధారణలో భాగంగా గ్రామస్థులను సంప్రదించగా.. సీతారామ్ కుటుంబానికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సీతారామ్ ఆరుగురు సోదరుల్లో ఐదో వ్యక్తి. ఈ క్రమంలో అతని సోదరుడికి పాఠశాల సిబ్బంది ఫోన్ చేశారు. సీతారామ్ వాళ్ల అన్నయ్య అక్కడే ఉన్నారని తెలుసుకున్న ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. 35 ఏళ్లుగా చూడని అన్నను కలిసే అవకాశం వచ్చిందన్న ఆనందంతో వెంటనే పాఠశాలకు వెళ్లారు.
పాఠశాలలో అన్నదమ్ములు ఎదురెదురుగా కనిపించిన క్షణం అత్యంత భావోద్వేగంగా మారింది. ఒకరినొకరు చూసుకున్న వెంటనే కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సీతారామ్ తన అన్నయ్య పాదాలకు నమస్కరించడంతో అక్కడున్న పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి స్కూటర్పై గ్రామంలో తిరుగుతూ తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 35 ఏళ్ల తర్వాత అన్నదమ్ములు కలుసుకోవడంతో గ్రామస్థులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. ఒక అధికారిక ధ్రువీకరణ పత్రం అనుకోకుండా విడిపోయిన అన్నదమ్ములను 35 ఏళ్ల తర్వాత తిరిగి కలపడం ఇప్పుడు స్థానికంగా ఆసక్తికర ఘటనగా మారింది.









