ఘట్కేసర్–బీబీనగర్ రైల్వే మార్గంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో గుర్తుతెలియని యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన 20701 వందేభారత్ ఎక్స్ప్రెస్.. ఘట్కేసర్, బీబీనగర్ స్టేషన్ల మధ్య కేఎం నంబర్ 221/10 నుంచి 221/12 ప్రాంతానికి చేరుకుంది.
అదే సమయంలో సుమారు 20 నుంచి 25 ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఏపీ 24 ఎన్ 9936 నంబర్ గల ఫ్యాషన్ ప్లస్ మోటార్సైకిల్పై రైల్వే పట్టాల మధ్య నుంచి బీబీనగర్ వైపు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న వందేభారత్ రైలు అతడిని ఢీకొట్టింది. అలాగే కొంత దూరం వరకు ఆ యువకుణ్ణి ఈడ్చుకెళ్లినట్టు సమాచారం.. అలా పట్టాల పక్కన పడిపోయిన అతను తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. బైక్ విడిభాగాలు దాదాపు 300 మీటర్ల మేర రైల్వే ట్రాక్పై చెల్లాచెదురుగా పడినట్లు.. అలాగే మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో అతని వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. ఇక మరణించిన యువకుడి వయసు సుమారు 20 నుంచి 25 ఏళ్లు, ఎత్తు దాదాపు 5.6 అడుగులు, చామనఛాయ రంగు ఉంటుందని పోలీసులు తెలిపారు. కుడివైపు ఛాతీపై పుట్టుమచ్చ ఉన్నట్లు గుర్తించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిప్యూటీ ఎస్ఎస్ నుంచి సమాచారం అందడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈ యువకుడి గురించి ఎవరికైనా సమాచారం ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ 8712658581 లేదా దర్యాప్తు అధికారి 9666280808 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు..









