తెలంగాణ

Telangana: SIR పక్రియలో మరో ట్విస్ట్..ఈసీకి తెలంగాణ సీఈవో కీలక లేఖ!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఓటరు స్వయంగా హాజరుకావాలనే నిబంధనపై రాజకీయ పార్టీలన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రధాన పార్టీలు కూడా ఈ నిబంధనను సడలించాలని కోరుతున్నాయి.

తెలంగాణలో ఓటర్ల తొలగింపు ప్రక్రియ కలకలం రేపుతోంది.. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల రాష్ట్రంలో ఏకంగా కోటి వరకు ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కాగా అధికారులు మొత్తం 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 47 లక్షల మందికి మాత్రమే నోటీసులు అందినట్టు తెలుస్తుంది. మిగిలిన 45 లక్షల మందికి ఇప్పట్లో నోటీసులు ఇవ్వడం దాదాపు అసాధ్యంగా మారింది. మరోవైపు నోటీసులు అందుకున్న వారిలోనూ కేవలం 9 లక్షల మంది మాత్రమే స్పందించడం గమనార్హం.

ఓటర్ల విసుగు.. అధికారుల ఆందోళన

ఇక దూరప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వెళ్లిన కుటుంబాలు.. ఒక రోజు సెలవు పెట్టి.. రూ.వందలు, వేలు ఖర్చు చేసి ఓటు కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుండటంతో నోటీసులకు సమాధానాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులు గుర్తించారు. అంతేకాదు ఓటు ఉంటే ఎంత.. పోతే ఎంత.. అనే నైరాశ్యానికి గురవుతున్నారు. ఇక అధికారుల నోటీసులకు స్పందించకపోతే మరో 25 నుంచి 30 లక్షల ఓట్లు డిలీట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 72 లక్షల ఓట్లు తొలగించగా, ఇప్పుడు ఇవి కూడా కలిస్తే ఆ సంఖ్య సుమారు కోటికి చేరుకుంటుంది!..

రాజకీయ పార్టీల నిరసన

ఓటరు స్వయంగా హాజరుకావాలనే నిబంధనపై రాజకీయ పార్టీలన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రధాన పార్టీలు కూడా ఈ నిబంధనను సడలించాలని కోరుతున్నాయి. వృద్ధులు, వికలాంగులు, NRIలకు ఇచ్చిన సడలింపులను అందరికీ వర్తింపజేయాలని.. కుటుంబంలో ఎవరు వచ్చి ఆధారాలు ఇచ్చినా అంగీకరించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాయి.

గడువు పెంపుపై లేఖ

పరిస్థితి తీవ్రతను గుర్తించిన తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును కనీసం మూడు వారాల పాటు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో 92 లక్షల ఓటర్లకు నోటీసులు ఇవ్వడం, వారు సమాధానాలు ఇవ్వాల్సి ఉందని, ఈ నేపథ్యంలో గడువు పొడగించడం అనివార్యమని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు కేవలం 47లక్షల ఓటర్లలో 9 లక్షల మంది మాత్రమే సమాధానాలు ఇచ్చారని వివరించారు.

ఒకవైపు ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం.. మరోవైపు అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత.. ఈ రెండింటి మధ్య తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..

#Telangana#SIR Process#Voter List#CEO Sudarshan Reddy#Revanth Reddy#SIR process#Missing vote
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి