తెలంగాణ

Telangana: తెలంగాణలో ఆర్గాన్ స్కామ్.. అత్యంత రహస్యంగా జీవో 33 జారీ?!..

రచన: Venu8 నిమిషాల పఠనం

ఇప్పటివరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షణలో సాగుతున్న అనుమతుల ప్రక్రియను పక్కనబెట్టి.. ప్రయివేటు ఆస్పత్రులకే సర్వాధికారాలు కట్టబెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత రహస్యంగా జీవో ఎంఎస్ నం.33ను జారీ చేసిందనే ప్రచారం జరుగుతుంది..

వైద్యులు అంటే దేవుడితో సమానం అంటారు. కానీ కొందరు వైద్యుల తీరు ఇందుకు భిన్నంగా ఉందనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. వైద్య వృత్తికి మచ్చ తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోగుల ఆరోగ్యం కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తూ.. అవసరం లేని పరీక్షలు, చికిత్సలు, మందులను సూచిస్తున్నారనే వార్తలు తరచుగా వెలుగులోకి రావడం తెలిసిందే..

ఇది చాలదన్నట్టు తెలంగాణలో మానవ అవయవ మార్పిడి అనే స్కామ్ కు తెరలేపారు కొందరు పెద్దాసుపత్రుల డాక్టర్లు.. వీరికి అధికారులు, ప్రభుత్వ పెద్దలు వంత పాడటం ఆందోళనకరమైన అంశంగా మారింది. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనుమతుల వ్యవస్థను కార్పొరేట్ ఆస్పత్రుల చేతుల్లో పెట్టి, అవయవదానాన్ని రూ.కోట్లు కుమ్మరించే అక్షయపాత్రగా మార్చేందుకు తెరవెనుక భారీ కుట్ర జరిగిందనే ఆరోపణలు సంచలనంగా మారాయి..

ఇప్పటివరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షణలో సాగుతున్న అనుమతుల ప్రక్రియను పక్కనబెట్టి.. ప్రయివేటు ఆస్పత్రులకే సర్వాధికారాలు కట్టబెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత రహస్యంగా జీవో ఎంఎస్ నం.33ను జారీ చేసిందనే ప్రచారం జరుగుతుంది.. మరోవైపు ఈ జీవోను ఇప్పటివరకు ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో గానీ, పబ్లిక్ డొమైన్‌లోనూ పెట్టకుండా తొక్కిపెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది!..

అసలు ఈ జీవో విషయంపై కనీసం వైద్య వర్గాలకు కూడా సమాచారం లేదంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజాక్షేత్రంలో చర్చకు రాకుండా రహస్యంగా ఉంచిన ఈ వివాదాస్పద జీవో తాజాగా బయటపడటంతో.. కార్పొరేట్ కుట్ర బాగోతం బట్టబయలైంది.

అధికారుల వైఫల్యం.. కార్పొరేట్ శక్తులకు లాభం!

ఈ జీవో రూపకల్పన వెనుక కార్పొరేట్ శక్తులతో కొందరు ఉన్నతాధికారులు చేతులు కలిపినట్లు ప్రచారం జరుగుతుంది. పెద్ద పెద్ద ప్రయివేటు ఆస్పత్రులకు లాభాలు చేకూర్చేందుకు అధికారులు తమవంతుగా సాయం చేస్తూ ఫైళ్లను పరుగులు పెట్టించారు. డీఎంఈ కార్యాలయంలో గత ఐదేళ్లుగా ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగంలోనే తిష్టవేసిన ఓ కీలక అధికారిణి.. ప్రమోషన్ వచ్చినా విజిలెన్స్ సెక్షన్‌కు వెళ్లకుండా అక్కడే పాతుకుపోయి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వానికి పాజిటివ్ రిమార్కులు పంపించి జీవో వెలువడేలా చక్రం తిప్పారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో ప్రైవేటు ఆసుపత్రులకే ట్రాన్స్‌ప్లాంటేషన్ అనుమతుల బాధ్యత అప్పగించే జీవోను అధికారులు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నకు సమాధానం లేదు. అసలు ఈ జీవోపై పాలకులకు సమాచారం ఉందా? లేదా? అనే సందేహాలు కూడా ఈ సందర్భంలో వ్యక్తమవుతున్నాయి.

సర్జరీల ముసుగులో పెద్ద స్కామ్!

జీవో 33లోని రూల్ 11(4) ప్రకారం.. ఏడాదికి 25 లేదా అంతకంటే ఎక్కువ అవయవ మార్పిడులు చేసే ఆస్పత్రులే స్వయంగా తమ ఇన్-హౌస్ కమిటీలతో అనుమతులు ఇచ్చుకోవచ్చని స్పష్టం చేశారు. అంతేకాదు, రక్త సంబంధీకులు కాని అన్‌రిలేటెడ్ డోనర్లు, విదేశీ రోగుల కేసులను సైతం ఆస్పత్రి యాజమాన్యాలే విచారించి అనుమతులు మంజూరు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

గతంలో సరూర్ నగర్ అలకానంద ఆస్పత్రిలో వెలుగులోకి వచ్చిన అక్రమ కిడ్నీ మార్పిడి దందాలో ఒక్కో కిడ్నీ కోసం రూ.80 లక్షల వరకు వసూలు చేసి.. దాతలకు మాత్రం రూ.5 లక్షలు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని వైద్యులు, బ్రోకర్లు పంచుకున్నారు. అలాంటిది ఇప్పుడు తనిఖీ చేసే అధికారాన్ని, ఆపరేషన్ చేసి రూ. కోట్లు గడించే ప్రయివేట్ ఆస్పత్రులకే కట్టబెట్టడమంటే.. దొంగలకే తాళం చెవులు అప్పగించడమే అవుతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

పేదలకు అందని ద్రాక్ష.. ధనవంతులకే అవయవాలు!

మరోవైపు ఈ రహస్య జీవో అమల్లోకి వస్తే అవయవమార్పిడి అనేది సాధారణ, మధ్యతరగతి ప్రజలకు పూర్తిగా అందని ద్రాక్షగా మారనుందనే విమర్శలు వస్తున్నాయి. అదీగాక కేవలం సంపన్నులకు మాత్రమే అవయవమార్పిడి దక్కే ప్రమాదకర పరిస్థితి దాపురిస్తుంది. దళారులతో కుమ్మక్కయ్యే కార్పొరేట్ నెట్‌వర్క్‌లు.. పేదరికంలో ఉన్నవారి నుంచి చౌకగా అవయవాలను సేకరించి, సంపన్నులకు, విదేశీయులకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు భారీ ప్యాకేజీలకు అమ్ముకునే అధికారిక లైసెన్స్‌గా ఈ జీవో మారనుందనే ఆరోపణలు ఉన్నాయి..

అవయవాలు మార్కెట్లో దొరికే వస్తువులా?

ఇక అవయవ దానం అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదు.. అలాంటిది ఎంతో విలువైన మానవ అవయవాలను రూ.కోట్లు కురిపించే బిజినెస్ గా మార్చేందుకు దళారులు, అధికారులు రచించిన ఈ వ్యూహంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అత్యంత రహస్యంగా తెచ్చిన ఈ జీవో 33ను తక్షణమే రద్దు చేయాలని, అవయవ మార్పిడి ప్రక్రియపై వైద్య రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు స్వతంత్ర న్యాయ, నిఘా వ్యవస్థల పర్యవేక్షణను తిరిగి అమలు చేయాలని ప్రజా సంఘాలు, వైద్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. వైద్య సేవల్లో నిబంధనల ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, రోగుల హక్కులకు రక్షణ కల్పించాలంటే స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థ అవసరమని వారు స్పష్టం చేస్తున్నారు..

#Telangana#Organ Transplantation#GO MS 33#Health Department#DME#Medical#Rules#Corporate Hospitals#Scam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి