జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మంత్రివర్గంలోని కీలక నేత హఠాన్మరణం పొందారు. దీంతో రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. జార్ఖండ్ రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధి, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి సుదివ్య కుమార్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. హర్సింగరాయ్డీహ్లోని తన నివాసంలో ఇవాళ ఉదయం తీవ్రమైన ఛాతినొప్పితో ఆయన బాధపడినట్టు తెలిసింది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గిరిడీహ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంత్రి సుదివ్య కుమార్ మరణవార్త తెలియడంతో ఆయన కుటుంబీకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.
మంత్రి ఇకలేరని వైద్యులు ప్రకటించడంతో జేఎంఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, ధన్బాద్ ఎస్ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని నివాళులర్పించారు. మంత్రి సుదివ్యకుమార్ మృతిపై అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) భావోద్వేగ పోస్టు పెట్టింది.
‘మంత్రి సుదివ్య కుమార్ అకాల మరణంతో జేఎఎం పార్టీ, కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురైంది. ఆయన మరణం పార్టీకి, ప్రభుత్వంతో పాటు జార్ఖండ్ రాష్ట్రానికి తీరని లోటు. ఆయన పోరాటాలు, సేవలు సహకారం ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా కుటుంబం తరఫున ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్నాం.ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి, సహచరులందరికీ ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం’ అని రాసుకొచ్చింది.కాగా, మంత్రి సుదిప్య కుమార్ మరణం జార్ఖండ్ రాష్ట్రానికి తీరని లోటు అని బీజేపీ నేత ప్రతుల్ షాదేవ్ సంతాపం తెలిపారు.









