ఒకప్పుడు తన పదునైన వేగంతో ప్రపంచంలోని దిగ్గజ బ్యాటర్లను భయపెట్టిన భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్, బెంగళూరు ‘నమ్మ మెట్రో’లో సాధారణ ప్రయాణికుడిలా దర్శనమిచ్చారు. చేతిలో ట్రాలీ బ్యాగ్ పట్టుకుని, చెవులకు ఇయర్ బడ్స్ పెట్టుకుని నిలబడి ఉన్న ఆయన ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ప్రజా రవాణాలో ప్రయాణిస్తున్న ఆయనను చూసి అభిమానులు 'శ్రీనాథ్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్' అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
బెంగళూరు మెట్రోలో నీలం రంగు జీన్స్, షర్ట్ ధరించి ఉన్న శ్రీనాథ్ను ఒక అభిమాని గుర్తించి తీసిన ఈ ఫోటో క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారత క్రికెట్లో అత్యంత సుదీర్ఘకాలం పాటు సేవలందించిన గొప్ప పేసర్లలో శ్రీనాథ్ ఒకరు. 1992 నుంచి 2003 వరకు వరుసగా నాలుగు వన్డే ప్రపంచకప్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, వరల్డ్ కప్ వేదికపై ఏకంగా 44 వికెట్లు పడగొట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో శ్రీనాథ్ మొత్తం 296 మ్యాచ్లు ఆడి 551వికెట్లు పడగొట్టారు. ఇందులో 67 టెస్టుల్లో 236 వికెట్లు సాధించగా, 229 వన్డేల్లో 315 వికెట్లు పడగొట్టారు. వన్డేల్లో 300కు పైగా వికెట్లు సాధించిన ఏకైక భారతీయ ఫాస్ట్ బౌలర్గా శ్రీనాథ్ ఇప్పటికీ రికార్డుల్లో నిలిచారు. బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటింగ్తో అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 1,892పరుగులు కూడా పూర్తి చేశారు.
ప్రస్తుతం ఐసీసీ మ్యాచ్ రెఫరీగా సేవలందిస్తున్న ఆయన, భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పేరుగాంచారు. మైదానంలో అంతటి ఘనమైన రికార్డులు కలిగి ఉండి కూడా, రియల్ లైఫ్లో ఎంతో వినయంగా, సాధారణ వ్యక్తిలా మెట్రోలో ప్రయాణించడం ఆయన గొప్పదనానికి అద్దం పడుతోందని నెటిజన్లు కొనియాడుతున్నారు.












