రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ఎల్ నినో ప్రభావంతో ఈసారి ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా పెద్దగా వర్షాలు కురవలేదు.దీంతో ఈసారి సమ్మర్లో హీట్ వేవ్స్ ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది.అయితే, వర్షాకాలం ముగియడానికి వస్తున్న తరుణంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో ఉన్నట్టుండి భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే.
అయితే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.గతవారం రోజులుగా రాష్ట్రంలో చెదురుమొదురు వర్షాలు కురుస్తున్నాయి. నేడు సైతం తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నిన్న పలు జిల్లాల్లో వర్షం కురవగా ఇప్పటికీ వాతావరణం మేఘావృతంగానే కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఉత్తర, తూర్పు తెలంగాణలో ఇవాళ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్,కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
పెద్దపల్లి, రామగుండంలోనూ భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్లోనూ నేడు వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నైరుతి కారణం కాదని, అల్పపీడనం ప్రభావమని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇదిలాఉండగా, రాష్ట్రంలో ఈసారి ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు అల్లాడుతున్నారు.చాలా చోట్ల వరి వేయడంతో రాత్రి వేళల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలాలు తడుపుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం వరి వేయొద్దని సూచించినా రైతు భరోసా, బోనస్ వస్తుందనే ఆశతో ధాన్యం పండించడానికే అన్నదాతలు మొగ్గుచూపినట్టు సమాచారం.












