ఆర్ఎస్ఎస్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ దేశ భవిష్యత్తుకు నిర్దేశకులైన జెన్ Z (Gen Z), జెన్ ఆల్ఫా తరాలకు చెందిన యువతతో కీలక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దేశ నిర్మాణం, నాయకత్వ లక్షణాల పెంపొందింపు, ప్రపంచాన్ని ఏకం చేయడంలో భారతదేశ వహిస్తున్న కీలక పాత్ర వంటి అంశాలపై ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. ‘ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్ (IIMUN)’ సంస్థ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) వేదిక నేడు ఈ సదస్సు ప్రారంభం కానుంది.
ఈ సదస్సులోని ప్రారంభ సెషన్లో ‘ప్రపంచాన్ని ఏకం చేయడంలో యువత పాత్ర - భారతీయ విధానం’ అనే ప్రధాన అంశంపై మోహన్ భగవత్ కీలకోపన్యాసం చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా నగరాల నుంచి 15 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన దాదాపు 2వేల మందికి పైగా పాఠశాల, కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఐఐఎమ్యుఎన్ వ్యవస్థాపకుడు రిషబ్ షా మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, విలువలను నవతరానికి పరిచయం చేస్తూ వారిని సమర్థవంతమైన భావి నాయకులుగా తీర్చిదిద్దడమే తమ సంస్థ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
యువత అన్ని రకాల సంస్థలు, సిద్ధాంతాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, సావర్కర్ వంటి మహనీయులందరూ ఈనాటి తరానికి గొప్ప ఆదర్శప్రాయులని రిషబ్ షా పేర్కొన్నారు. ఐఐఎమ్యుఎన్ నిర్వహించే జాతీయ స్థాయి సదస్సులో మోహన్ భగవత్ పాల్గొనడం ఇది మూడోసారి కావడం విశేషం. ఈ మహోత్సవానికి ఆర్ఎస్ఎస్ చీఫ్తో పాటు ప్రముఖ నటి షబానా అజ్మీ, బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ వంటి పలువురు విభిన్న రంగాల ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.












