National

Nepal Flood: నేపాల్‌లోప్రకృతి విలయం.. 392కు పెరిగిన మృతుల సంఖ్య!..

రచన: Venu5 నిమిషాల పఠనం

త్రిశూలి నదిలో కేవలం 30 నిమిషాల్లోనే నీటిమట్టం దాదాపు 9 మీటర్ల మేర పెరిగింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో గ్రామాలు, పట్టణాలు జలమయమయ్యాయి. ప్రజలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఇళ్లు, మార్కెట్లు, రహదారులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

నేపాల్‌ను వరద ప్రవాహాలు వణికించాయి. ఎటు చూసినా ప్రకృతి విలయమే కనిపిస్తోంది. కళ్లముందే కూలిపోతున్న భవనాలు.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్న వాహనాలు.. బురదలో కూరుకుపోతున్న గ్రామాలు.. ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న ప్రజలు.. నేపాల్‌లో నెలకొన్న భయానక పరిస్థితికి ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి.

రసువా జిల్లాలో మొదలైన వరద, బురద ప్రవాహం దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లి పలు జిల్లాల్లో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. భూకంపంతో మంచు, రాళ్లు, శిథిలాలు కొట్టుకొచ్చి లిండే నది ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుపడ్డాయి. ఆ అడ్డంకి తొలగిపోవడంతో ఒక్కసారిగా భారీగా నీరు, బురద దిగువకు పోటెత్తింది. భోటే కోశీ, త్రిశూలి నదులు ఉగ్రరూపం దాల్చడంతో పరిస్థితి మరింత విషమించింది.

త్రిశూలి నదిలో కేవలం 30 నిమిషాల్లోనే నీటిమట్టం దాదాపు 9 మీటర్ల మేర పెరిగింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో గ్రామాలు, పట్టణాలు జలమయమయ్యాయి. ప్రజలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఇళ్లు, మార్కెట్లు, రహదారులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య 392కు చేరింది. మరో 1,468 మంది గల్లంతయ్యారు. నేపాల్‌లోనే 288 మంది భారతీయుల ఆచూకీ తెలియడం లేదని సమాచారం..

గల్లంతైన వారిలో కొందరు తెలుగువారు కూడా ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మరోవైపు టిబెట్‌లోనూ భారీ విధ్వంసం చోటుచేసుకుంది. అక్కడ ముగ్గురు మృతి చెందగా, వందలాది మంది గల్లంతైనట్లు సమాచారం.. ఇక వరదల ధాటికి 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, సుమారు 40 కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయని సమాచారం. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు, కస్టమ్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న పలువురి జాడ కూడా తెలియడం లేదు.

మరోవైపు, గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇప్పటివరకు 84 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. చిక్కుకుపోయిన పర్యాటకులను కూడా సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ కష్టకాలంలో భారత్ నేపాల్‌కు అండగా నిలిచింది. బుధవారం నుంచి 47.5 టన్నుల అత్యవసర సహాయ సామగ్రిని నేపాల్‌కు పంపించింది. పరిస్థితిని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమీక్షించారు.

మరోవైపు భోటే కోశీ నదికి దిగువన భారీగా నీరు చేరడంతో మరోసారి వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలు నదీ తీరాలకు దూరంగా ఉండాలని నేపాల్ ప్రభుత్వం సూచించింది.. నేపాల్‌లో ఒక్కసారిగా విరుచుకుపడిన వరద.. క్షణాల్లో మారిపోయిన జీవితాలు.. బురదలో కలిసిపోయిన ఇళ్లు.. గల్లంతైన ఆత్మీయులు.. కన్నీటితో తమవారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు.. ప్రస్తుతం ప్రకృతి సృష్టించిన ఈ విలయం.. ఊహకు అందని విషాదాన్ని మిగిల్చింది. ఇక నేపాల్లో పరిస్థితి గురించి మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన కంట్రోల్‌ రూం నంబర్లు..

+91 11 2308 8718, +91 11 2308 8719

వాట్సప్‌ నంబరు +91 9968291988

ఈ మెయిల్‌: [email protected]

#Nepal Flood#Natural calamity#392 Death#massive-flood#Tibet
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి