మనిషి జీవితం ఒక వెలిగే జ్యోతి వంటిది.. ప్రమిదలో నూనె ఉన్నంతవరకు దీపం వెలుగుతుంది.. ఆ నూనె అయిపోయిన క్షణమే జ్యోతి ఆరిపోతుంది. అలాగే మానవ దేహంలో ప్రాణం ఉన్నంతవరకే జీవితం కొనసాగుతుంది. శ్వాస ఆగిపోయిన క్షణంలో.. మనం ఎంతో ప్రేమగా చూసుకున్న ఈ దేహం కేవలం పంచభూతాల సమాహారంగా మిగిలిపోతుంది. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే.. మరణం శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు..
ఇక ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా వచ్చే చివరి ఘట్టం మరణం.. అయితే ఒక మనిషి మరణించే సమయంలో ఏం జరుగుతుంది?.. చివరి శ్వాస తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది?.. మనిషి చనిపోయిన వెంటనే అంతా అయిపోయినట్టేనా?.. లేక అక్కడి నుంచే మరో ప్రయాణం మొదలవుతుందా?.. అనే ప్రశ్నలు ఆథ్యాత్మిక భావాలతో జీవించే వారి మదిలో తరచుగా మెదులుతాయి.. అయితే వీటికి సమాధానాలు గరుడ పురాణంలో వివరించినట్టు పండితులు చెబుతారు.
విష్ణుమూర్తి తన వాహనమైన గరుత్మంతుడికి ఉపదేశించిన ఆధ్యాత్మిక రహస్యాల సమాహారమే ఈ గరుడ పురాణం అని శాస్త్రాలు పేర్కొంటాయి. గరుడ పురాణం ప్రకారం, ఒక మనిషి ఆయుష్షు తీరిపోయే సమయానికి ముందుగా కొన్ని సూచనలు కనిపిస్తాయి. శరీరంపై మనిషికి ఉన్న నియంత్రణ ఒక్కొక్కటిగా సడలిపోతుంది. చివరికి తాను జీవితాంతం తనదిగా భావించిన ఈ దేహంపై కూడా తన అధికారం ఉండదు.
శ్వాస నెమ్మదిస్తుంది.. ఇంద్రియాలు బలహీనపడతాయి.. అలాగే చెమటలు పట్టడం, నోరు ఎండిపోవడంతో పాటు మూత్రాశయం, ప్రేగులను నియంత్రించే కండరాలు సడలిపోతాయి. అందుకే కొందరిలో చివరి క్షణాల్లో మలమూత్రాలు బయటకు రావడం కనిపిస్తుంది. ఇది శరీరం తన సహజ ప్రక్రియను ముగించుకుంటున్న ఒక శారీరక మార్పు. ఆధ్యాత్మికంగా చూస్తే.. ఈ దేహం కూడా నాది కాదు అని ప్రకృతి చివరి క్షణంలో మనిషికి గుర్తుచేసే దృశ్యంలా అనిపిస్తుంది.
ఇక గరుడ పురాణం ప్రకారం స్థూల శరీరం నుంచి ఆత్మ శరీరంలోని తొమ్మిది ద్వారాల (నవ ద్వారాలు) ద్వారా బయటకు వెళ్తుందని చెబుతారు. అందులో పుణ్యాత్ముల ప్రాణం ముఖం, కళ్లు లేదా నడినెత్తి (బ్రహ్మరంధ్రం) గుండా ప్రశాంతంగా నిష్క్రమిస్తుందని.. పాపాత్ముల ప్రాణం శరీరంలోని దిగువ భాగాల ద్వారా విసర్జించబడుతుందని తెలుపుతారు..
అలాగే ప్రాణం విడిచే ఆ క్షణంలో జీవుడు అనుభవించే బాధ.. వేల తేళ్లు ఒకేసారి కుడితే వచ్చే వేదనతో సమానమని శాస్త్రం వర్ణిస్తుంది. కానీ, ఇది అందరికీ ఒకేలా ఉండదు. జీవించి ఉన్నప్పుడు నిరంతరం దైవచింతన, ధర్మం, సత్కర్మలు ఆచరించిన వారికి ఈ మరణ వేదన అసలు తెలియదని విష్ణుభగవానుడు స్పష్టం చేశాడు. అలాగే మరణం అంటే జీవుడి అంతం కాదు. తన శరీరంతో ఉన్న బంధం తెగిపోయి.. మరో ప్రయాణం ప్రారంభమయ్యే దశ అని చెబుతారు.
శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. కానీ జీవుడు తన కర్మ సంస్కారాలను మోసుకుంటూ తదుపరి స్థితి వైపు ప్రయాణిస్తాడని ఈ ప్రేతకల్పం వివరిస్తుంది. మరణ సమయంలో ప్రాణశక్తి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత.. జీవుడి స్థూల దేహం అక్కడే మిగిలిపోతుంది. అయితే అతని కర్మలు మాత్రం అతన్ని విడిచిపోవు. తాను చేసిన మంచి, చెడు పనులన్నింటి ఫలితాలను ఎదుర్కోవాల్సిందేనని గరుడ పురాణం కర్మ సిద్ధాంతంలో చెబుతుంది.
మరణానంతరం జీవుడు ప్రేత స్థితిలో ఉంటాడని ఈ గ్రంథం వివరిస్తుంది. ఈ దశలో పిండప్రదానం, తర్పణం, శ్రాద్ధ కర్మలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. పిండాల ద్వారా ప్రేతశరీరం నుండి విముక్తి కలుగుతుందని చెబుతుంది. మరోవైపు మరణించిన వారికి చేసే పదమూడు రోజుల కర్మక్రియలు కేవలం ఆచారాలు మాత్రమే కాదని.. మరణించిన జీవుడి తదుపరి ప్రయాణానికి సహాయపడే ధార్మిక ప్రక్రియలుగా గ్రంథం వివరిస్తుంది.
ఆ తర్వాత మొదలవుతుంది యమలోక ప్రయాణం. గరుడ పురాణంలోని వర్ణన ప్రకారం.. జీవుడు తన గత కర్మల ప్రభావాన్ని అనుభవిస్తూ యమధర్మరాజు సన్నిధికి చేరే మార్గంలో ప్రయాణిస్తాడు. ఆ ప్రయాణంలో అనేక భయానక దృశ్యాలు, కష్టాలు, నదులు, మార్గాలు, వివిధ స్థితులను గ్రంథం ప్రతీకాత్మకంగా వివరిస్తుంది. ఇక శరీరాన్ని వదిలిన వెంటనే ఆత్మ తన భౌతికదేహాన్ని వదిలి వెళ్లడానికి ఇష్టపడదు.
తన బంధువులను, శరీరాన్ని చూసి మోహంతో దాని చుట్టూనే తిరుగుతుంది. మనం పెట్టే 'పిండ ప్రదానం', 'దహన సంస్కారాలు' ఆత్మకు ఈ భౌతిక బంధాల నుంచి విడుదల కలిగిస్తాయి. ఆ తర్వాతే యమదూతల సహాయంతో ఆత్మ తన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి పితృలోకానికి లేదా యమలోకానికి ప్రయాణమవుతుందని గరుడ పురాణం చెబుతుంది. ఇక్కడ ప్రతి వారు గమనించవలసి సత్యం.. మరణం తర్వాత మనిషి వెంట వెళ్లేది డబ్బు కాదు.. ఆస్తి కాదు.. బంధువులు కాదు.. తన కర్మ మాత్రమే.
అదేవిధంగా గరుడ పురాణం కేవలం భయపెట్టడానికి నరకాలను వర్ణించదు. మంచి జీవితం గడపాలి.. ధర్మాన్ని ఆచరించాలి.. భగవంతుడిని స్మరించాలి.. చివరికి మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి అనే సందేశాన్ని అందిస్తుంది. అందుకే జీవించి ఉన్నప్పుడే ధర్మాన్ని రక్షిస్తూ.. ఇతరులను బాధించకుండా జీవించాలి.. భగవంతుడిని స్మరించాలి. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.. కానీ అది వచ్చినప్పుడు మన వెంట ఏం రావాలో నిర్ణయించేది మనం మాత్రం.. ఇక మరణం అనేది శరీరానికి మాత్రమే కానీ ఆత్మకు కాదు. మన కర్మలతో మొదలయ్యే మరో ప్రయాణానికి అది ఒక మార్గం మాత్రమే.. గరుడ పురాణం చెప్పే అంతిమ బోధ ఇదే..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












