International

భాగవత్ సభకు అమెరికాలో ఆటంకాలు.. అసలేం జరుగుతోంది?

రచన: Kashi9 నిమిషాల పఠనం

భాగవత్ న్యూయార్క్ వేదికపై ఏం మాట్లాడబోతున్నారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఆర్‌ఎస్ఎస్ భావజాలంపై వస్తున్న విమర్శలకు ఆయన నేరుగా స్పందిస్తారా? అమెరికాలోని భారతీయ సమాజానికి ఏం సందేశం ఇస్తారు? హిందూ ఐక్యత, భారతీయ సంస్కృతి, ప్రపంచ శాంతి, మత సామరస్యం వంటి అంశాలపైనే దృష్టి పెడతారా?

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భాగ‌వ‌త్

మ‌రికొన్ని గంట‌ల్లో న్యూయార్క్‌లో మీటింగ్

భాగ‌వ‌త్ ప‌ర్య‌ట‌న‌పై అమెరికాలో రాద్ధాంతం

న్యూయార్క్‌లో అస‌లేం జ‌రుగుతోంది..?

ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ న్యూయార్క్‌ ప‌ర్య‌ట‌న వేళ‌.. అమెరికాలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. వేలాది మంది పాల్గొనే భారీ కార్యక్రమం.. ప్రపంచ ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వేదిక.. ఆర్‌ఎస్ఎస్ చీఫ్ ప్రసంగం.. ఇంతవరకు అంతా సాధారణంగానే కనిపించింది. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం చుట్టూ మద్దతు వర్సెస్ వ్యతిరేకత తీవ్రంగా మారింది.

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యతిరేకతతో మొదలైన వివాదం.. నిరసనలకు, వీసా రద్దు డిమాండ్లకు, సోషల్ మీడియా వార్‌కు దారితీసింది. మరోవైపు వందలాది హిందూ అమెరికన్ సంస్థలు భాగవత్ కార్యక్రమానికి మద్దతుగా నిలిచాయి. అసలు ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం ఇంతటి రాజకీయ వివాదంగా ఎందుకు మారింది?

ఒకే వేదిక.. రెండు భిన్న వాదనలు!

ఆగస్టు 29న న్యూయార్క్‌లో జరగనున్న కార్యక్రమానికి “యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్” అనే పేరు పెట్టారు. నిర్వాహకుల ప్రకారం.. ఇది హిందూ సమాజం మాత్రమే కాకుండా వివిధ మతాలు, సంస్కృతుల మధ్య ఐక్యత, సంభాషణ, పరస్పర అవగాహనను ప్రోత్సహించే కార్యక్రమం.

కానీ విమర్శకుల వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. ఆర్‌ఎస్ఎస్‌ను హిందూ జాతీయవాద భావజాలంతో అనుబంధం ఉన్న సంస్థగా పేర్కొంటూ.. మైనారిటీలపై వివక్షకు సంబంధించిన ఆరోపణలు, భారతదేశంలో మత స్వేచ్ఛపై జరుగుతున్న చర్చలను వారు ప్రస్తావిస్తున్నారు. అందుకే ఆర్‌ఎస్ఎస్ చీఫ్‌కు అమెరికాలో ఇంత పెద్ద వేదిక ఇవ్వడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. అంటే.. నిర్వాహకులకు ఇది ‘ఐక్యత’ కార్యక్రమం అయితే.. విమర్శకులకు మాత్రం ఇది ‘ఐడియాలజీ’ కార్యక్రమం.

మమ్దానీ ఎంట్రీతో.. ముదిరిన వివాదం

ఈ వివాదానికి మరింత రాజకీయ రంగు తీసుకొచ్చింది న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలు. భాగవత్ పాల్గొనే కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వబోనని మమ్దానీ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్ఎస్ భావజాలం న్యూయార్క్ నగరం ప్రాతినిధ్యం వహించే బహుళత్వ విలువలకు విరుద్ధంగా ఉందన్నది ఆయన వాదన.

ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒకవైపు అమెరికా నగరానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఒక భారతీయ సంస్థ అధినేత కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తుంటే.. మరోవైపు అమెరికాలోని భారతీయ, ముఖ్యంగా హిందూ సంస్థలు దీనిని భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశంగా చూస్తున్నాయి. దీంతో భాగవత్ కార్యక్రమం.. న్యూయార్క్ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

వీసా రద్దుకు డిమాండ్!

ఈ వివాదం మరో అడుగు ముందుకేసింది. అమెరికా కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్‌ (USCIRF) మోహన్ భాగవత్ వీసాపై చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాదు.. ఆర్‌ఎస్ఎస్‌తో సంబంధం ఉన్న కొందరిపై ఆంక్షలు విధించాలన్న డిమాండ్ కూడా వినిపించింది.

హిందూ అమెరికన్ సంస్థల ఎదురుదాడి!

ఆరెస్సెస్ చీఫ్ ప‌ర్య‌ట‌న‌పై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలోనే మద్దతు కూడా బలంగా వినిపిస్తోంది. వందలాది హిందూ అమెరికన్ సంస్థలు భాగవత్ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి. నిర్వాహకుల వాదన ప్రకారం.. కార్యక్రమాన్ని రాజకీయ ర్యాలీగా చూడటం తప్పు. వివిధ సమాజాల మధ్య సంభాషణ కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని వారు అంటున్నారు.

ఇక్కడే అమెరికాలోని భారతీయ డయాస్పోరాలో మరో చర్చ మొదలైంది. ఒక వ్యక్తి రాజకీయ భావజాలం నచ్చకపోయినా.. ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదా? లేదా.. ఒక సంస్థ భావజాలంపై తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నప్పుడు.. ఆ సంస్థ అధినేతకు భారీ వేదిక ఇవ్వడాన్ని ప్రశ్నించడం సమంజసమేనా?

ఇప్పుడు అసలు పోరాటం ఈ రెండు ప్రశ్నల చుట్టూనే తిరుగుతోంది.

సోషల్ మీడియాలోనూ వార్!

వివాదం ఆఫ్‌లైన్‌లోనే ఆగలేదు. కార్యక్రమ నిర్వాహక సంస్థకు సంబంధించిన ఎక్స్ ఖాతా తాత్కాలికంగా సస్పెండ్ కావడం కూడా కొత్త చర్చకు కారణమైంది. కొంత స‌మ‌యం తర్వాత ఖాతా పునరుద్ధరించబడింది. అయితే నిర్వాహకులు తమపై సోషల్ మీడియా దాడి జరిగిందని ఆరోపించారు. దీంతో భాగవత్ కార్యక్రమానికి ముందు నుంచే వేదిక బయట మరో డిజిటల్ వార్ మొదలైనట్టయింది.

అందరి చూపు భాగవత్ ప్రసంగంపైనే!

ఇంతటి వివాదం మధ్య మోహన్ భాగవత్ న్యూయార్క్ వేదికపై ఏం మాట్లాడబోతున్నారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఆర్‌ఎస్ఎస్ భావజాలంపై వస్తున్న విమర్శలకు ఆయన నేరుగా స్పందిస్తారా? అమెరికాలోని భారతీయ సమాజానికి ఏం సందేశం ఇస్తారు? హిందూ ఐక్యత, భారతీయ సంస్కృతి, ప్రపంచ శాంతి, మత సామరస్యం వంటి అంశాలపైనే దృష్టి పెడతారా? లేక ఈ వివాదంపై పరోక్షంగా స్పందిస్తారా? ఇప్పుడు ఆసక్తి కేవలం ఆయన ప్రసంగంపై కాదు.. ఆ ప్రసంగానికి వచ్చే అమెరికా రాజకీయ ప్రతిస్పందనపైనా.

భాగవత్ సభ.. ఆర్‌ఎస్ఎస్‌కు అంతర్జాతీయ పరీక్షా?

ఆర్‌ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరంలో భాగవత్‌కు అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికల్లో ఒకటైన మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో మాట్లాడే అవకాశం రావడం సంస్థకు ఒక ముఖ్యమైన అంతర్జాతీయ వేదికగా భావించవచ్చు. కానీ అదే సమయంలో ఈ కార్యక్రమం చుట్టూ వచ్చిన వివాదం కూడా ఒక సవాలే.

ఎందుకంటే భారత్‌లో ఆర్‌ఎస్ఎస్‌పై జరిగే రాజకీయ చర్చ ఒక స్థాయి అయితే.. అమెరికాలో అదే సంస్థను మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కులు, డయాస్పోరా రాజకీయాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ కోణంలో చూస్తున్నారు.

అందుకే మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వేదికగా భాగవత్ ఏం మాట్లాడతారన్నదానికంటే.. ఆ ప్రసంగం తర్వాత అమెరికాలో ఎలాంటి చర్చ మొదలవుతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఒకవైపు ‘యూనివర్సల్ వన్‌నెస్’ సందేశం.. మరోవైపు తీవ్ర వ్యతిరేకత.. భాగవత్ న్యూయార్క్ సభ.. ఐక్యతకు వేదిక అవుతుందా? లేక అమెరికాలో ఆర్‌ఎస్ఎస్‌పై మరో పెద్ద రాజకీయ చర్చకు తెరతీస్తుందా? ఇప్పుడు దీనిపైనే స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

#Mohan Bhagwat#RSS#RSS New York Event#RSS Controversy#New York#Hindu Americans#US Politics#India US Relations#RSS Chief#Hindu Diaspora#Zohraan Mamdani#US Religious Freedom#Telangana News#India News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి